గుర్గావ్ ఆస్పత్రిలో ఇరాకీ మహిళపై లైంగిక దాడి
గుర్గావ్: దేశ రాజధానికి సమీపంలోని గుర్గావ్లోని ఆస్పత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన ఓ ఇరాకీ మహిళపై ఆసుపత్రి ఉద్యోగి ఒకరు లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన ఈ ఏడాది మే 5వ తేదీన జరిగింది.
ఇరాక్ కు చెందిన 48 ఏళ్ల ఓ మహిళ రెండు నెలల క్రితం అనారోగ్యంతో గుర్గావ్లోని ఫోర్టీస్ మెమోరియల్ ఆసుపత్రిలో చేరింది. ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి ఒకరు తనపై లైంగికంగా దాడి చేశారని ఆఇరాకీ మహిళ ఇరాక్ రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై ఇరాక్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన లేఖ, బాధిత మహిళ ఫిర్యాదులపై ఐపీసీ 354 ఏ ప్రకారం లైంగిక వేధింపులపై సుశాంత్ లోక్ పోలీసుస్టేషనులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గుర్గావ్ తూర్పు డీసీపీ దీపక్ సహారన్ చెప్పారు. సోమవారంనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు నెలల క్రితం తమ ఆసుపత్రిలో ఇరాకీ మహిళపై లైంగిక వేధింపులు జరిగిన సంఘటన గురించి తమకు తెలియగానే దీనికి బాధ్యుడైన కాంట్రాక్టు ఉద్యోగితోపాటు కార్మిక ఏజెన్సీని తొలగించామని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఆస్పత్రి ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ లైంగిక వేధింపుల ఘటన దర్యాప్తులో తాము పోలీసులకు సహకారం అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.