RSS అజెండాలో భాగంగానే అగ్నిపథ్?
RSS అజెండాలో భాగంగానే అగ్నిపథ్ తీసుకొచ్చారా? అంటూ RJD నేత తేజస్వీ యాదవ్ భారతీయ జనతాపార్టీని ప్రశ్నించారు. చదువుకున్న యువతకు అగ్నిపథ్ విధానం జాయతీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటిదా? అంటూ మోడీ సర్కార్ ని ఆయన నిలదీశారు. అగ్నిపథ్ నియామకాలపై యువతకు అనేక సందేహాలున్నాయని, దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బీహార్లో నిరసనలు తీవ్రంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
యువత శాంతియుతంగా తమ నిరసన తెలియజేయలని తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు. దేశంలో యువత ఇంత నిరసన తెలియజేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ గురించి మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు నో ర్యాంక్, నో పెన్షన్ ను అమల్లోకి తెస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా తేజస్వీ ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధించారు. సైన్యంలోని ఉన్నతాధికారుల నియామకాలకు అగ్నిపథ్ ను ఎందుకు వర్తింపచేయడంలేదన్నారు. సైనికులుగా మారాలనుకుంటున్నవారిలో ఈ కొత్త విధానం ఆగ్రహం, ఆవేదన కలిగిస్తోందని, దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బీహార్లో చెలరేగుతున్న హింసకు జేడీయే కారణమన్న బీజేపీ ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత నిరసన బాట పట్టింది. ఈరోజు 60 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తోపాటు తెలంగాణ కూడా అల్లర్లకు వేదికైంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వం అగ్నిపథ్ పై ముందుకే వెళ్ళనుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.