కాంగ్రెస్ పాక్లో పోటీ చేస్తోందా?: అమిత్ షా, రాహుల్ స్పందించాలని..
భువనేశ్వర్: కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 31న గుజరాత్ తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో పాకిస్థాన్ బోటు సంఘటనపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేయడంపై అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసేది భారత్లోనా లేక పాక్లోనా చెప్పాలని ఆ పార్టీని ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం కృతనిశ్చయంతో చేస్తున్న ప్రయత్నాల్లో తప్పులు వెతకడానికి బదులు మన భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్షాలపై ఉందని అన్నారు. సున్నితమైన విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరోధించాలని అమిత్ షా సూచించారు.
ఒరిస్సాలో మంగళవారం పర్యటించిన ఆయన బిజెపి ఏర్పాటు చేసిన ‘మహాసంగ్రామ్' ర్యాలీలో మాట్లాడారు. డిసెంబర్ 31న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. పోరుబందర్ సమీపంలో భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వేటాడటంతో ఉగ్రవాదులు బోటును పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు వచ్చారని నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ కుమార్ స్పందిస్తూ.. ఉగ్రవాదదాడిని నిరోధించామని ప్రభుత్వం ఎలా చెబుతుంది? ఎలాంటి సాక్ష్యం లేదని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేతపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు.
ఉగ్రవాద దాడి నుంచి దేశాన్ని కాపాడినందుకు తీర రక్షక దళం (కోస్టుగార్డు), రక్షణ ఇంటెలిజన్స్ విభాగాన్ని అమిత్ షా ప్రశంసించారు. ఉగ్రవాదులు జరిపే ఏ దాడినైనా భగ్నం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సరిహద్దుల్లో పాక్ జరిపే కాల్పులకు గట్టిగా సమాధానం చెప్తోందని ఆయన అన్నారు.