జయలలిత 'దోషి'.. ప్రభుత్వ పథకాల్లో ఇక 'అమ్మ' ఫోటో లేనట్టేనా?
వ్యక్తి ఆరాధనతో ఊగిపోయే తమిళ పాలిటిక్స్ లో అమ్మ పట్ల అక్కడి జనం, అన్నాడీఎంకె నేతలు ఎంతటి భక్తి శ్రద్దలు కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ చివరి రోజుల్లో మొత్తం తమిళనాడు ఆమె కోసం రోధించనడంల
చెన్నై: వ్యక్తి ఆరాధనతో ఊగిపోయే తమిళ పాలిటిక్స్ లో అమ్మ పట్ల అక్కడి జనం, అన్నాడీఎంకె నేతలు ఎంతటి భక్తి శ్రద్దలు కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ చివరి రోజుల్లో మొత్తం తమిళనాడు ఆమె కోసం రోధించనడంలో అతిశయోక్తి లేదు.
అయితే గతేడాది జూలై తర్వాత అనూహ్యంగా మళ్లీ అక్రమాస్తుల కేసు తెరపైకి రావడం, శశికళతో పాటు జయలలితను కూడా దోషిగా తేల్చడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమ్మ ఫోటోను ప్రజా సంబంధ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి.
జయలలిత లేకపోయినా.. ఆమె ఫోటోను పెట్టుకుని ఆరాధిస్తున్నవాళ్లు తమిళనాడులో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకె నేతలు ప్రతీ సందర్బంలో అమ్మ ఫోటోకు దండం పెట్టుకున్న తర్వాతే ఏ పనైనా మొదలుపెడుతారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లోను అమ్మ ఫోటో తప్పనిసరి.
ప్రస్తుతం అధికారం కోసం ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి, ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం తాము అధికారంలోకి వస్తే అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెబుతున్నారు. అయితే సుప్రీం దోషిగా తేల్చిన వ్యక్తి ఫోటోను ప్రభుత్వ కార్యక్రమాల్లో, పథకాల్లో ఉపయోగించవచ్చా? అన్నదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
ఇదిలా ఉంటే, నిన్నటిదాకా అమ్మకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటు ఆవరణలో ఆమె విగ్రహం పెట్టాలని వినిపించిన డిమాండ్స్ అన్ని మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కూడా లేదు. దోషిగా తేలిన వ్యక్తికి ఇలాంటి గౌరవాలు దక్కాలని కోరడం కూడా రాజ్యాంగ విరుద్దమే అవుతుంది.
ఇక మెరీనా బీచ్ లోని అమ్మ సమాధిని స్మారక కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న తరుణంలో.. ఆమెను కోర్టు దోషిగా ప్రకటించడంతో ప్రభుత్వ నిధులను కూడా ఇందుకోసం వెచ్చించే పరిస్థితి లేదు. మొత్తం మీద కోర్టు తీర్పు అమ్మ పట్ల అభిమానం చాటుకోవాలనేవారికి ప్రతికూలంగా మారింది. మరి ఈ సవాళ్లను అధిగమించి అన్నాడీఎంకె నేతలు అమ్మ పట్ల తమ భక్తిని ఏవిధంగా చాటుకుంటారో వేచిచూడాలి.