మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?
కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు మీద ప్రతిష్ఠించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు ఆవిష్కరించారు.
అయితే, పార్లమెంటు భవనం మీద చిహ్నాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించడమేమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు లౌకిక స్ఫూర్తికి వ్యతిరేకమని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
https://twitter.com/narendramodi/status/1546410099144540160
కొత్త పార్లమెంటు భవనం మధ్యలో పైకప్పు మీద ప్రతిష్ఠించిన ఈ కాంస్య విగ్రహం బరువు 9,500 కిలోలు. ఎత్తు ఆరున్నర మీటర్లు.
జాతీయ చిహ్నం ఆవిష్కరణ వేడుకల్లో మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర గృహ-నగరాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురీ పాల్గొన్నారు.
మోదీ ఈ సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఆ తరువాత ఆయన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికులతో మాట్లాడారు.
కాంస్య జాతీయ చిహ్న ఆవిష్కరణపై బీజేపీ శ్రేణులు ఉత్సాహాన్ని ప్రకటించాయి. బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, "కొత్త పార్లమెంటు భవనం మీద మూడు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఈ క్షణం ఎంతో గర్వకారణం" అని ట్వీట్ చేశారు.
https://twitter.com/nitin_gadkari/status/1546460386257281024
కానీ, కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు చేశారు.
పార్లమెంటు భవనం మీద ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం నేత యేచూరి సీతారాం అన్నారు. భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యంలోని మూడు వ్యవస్థలను స్పష్టంగా వేరు చేసి చూపించిందని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్), పార్లమెంటు, రాష్ట శాసనసభలు (లెజిస్లేచర్), న్యాయవ్యవస్థ... ఈ మూడూ వేటికవే ప్రత్యేక వ్యవస్థలని రాజ్యాంగం చెబుతోదని యేచూరి గుర్తు చేశారు.
పార్లమెంటును రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వ వ్యవస్థకు ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు. శాసనవ్యవస్థ లేదా లెజిస్లేచర్ తమదైన స్వతంత్ర పాత్రను నిర్వహిస్తుంది. చట్టాలను రూపొందించడం, అవి సక్రమంగా అమలయ్యేలా, అందుకు అధికార వ్యవస్థ బాధ్యత వహించేలా చేయడం దీని పని.
రాజ్యాంగపరంగా వేటికవే ప్రత్యేకంగా ఉన్న ఈ వ్యవస్థలను ప్రభుత్వ పెద్ద పూర్తిగా అణచివేస్తున్నారని సీతారాం యేచూరి విమర్శించారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని చర్యను తప్పు పట్టారు.
https://twitter.com/asadowaisi/status/1546410999808290820
దీనిపై ట్విటర్లో స్పందించిన అసదుద్దీన్, "లోక్సభకు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తారు. లోక్సభ ప్రభుత్వం కింద పని చేయదు" అని అన్నారు. అందుకే, ప్రధాని పార్లమెంటు మీద మూడు సింహాల చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
పార్లమెంటు, జాతీయ చిహ్నం అనేవి భారత ప్రజలకు చెందినవని, అవి ఏ ఒక్క పార్టీవి లేదా ఏ ఒక్క వ్యక్తివో కావని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు.
https://twitter.com/K_Nageshwar/status/1546743412116037636
ఇది అన్ని రాజకీయ పక్షాల సమక్షంలో జరిగి ఉంటే ప్రజాస్వామికంగా ఉండేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, జాతీయ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో మతపరమైన పూజలు చేయకూడదని సీపీఎం విమర్శించింది. ఇది భారత ప్రజలందరి చిహ్నం. అంతేకానీ, ఏదో ఒక్క మత విశ్వాసానికి సంబధించింది కాదని ఆ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా విమర్శించింది.
మతాన్నిరాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆ పార్టీ తన ట్వీట్లో పేర్కొంది. దేశంలో ఎవరైనా తమ మత విశ్వాసాలను పాటించుకనే హక్కు ఉంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఏ మత ఆచారాన్నీ పాటించకూడదు, ప్రచారం చేయకూడదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోదని సీతారాం యేచూరి అన్నారు.
దీనికితోడు, ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకులు ఎవరినీ పిలవపోవడంపై కూడా కొందరు నేతలు విమర్శించారు. పార్లమెంటు ఒక్క పార్టీదో ఒక్క ప్రధానితో కాదని అది దేశ ప్రజలందరిదనీ కొందరు నేతలు ట్వీట్లు చేశారు. పార్లమెంటు నిర్మాణంలో అన్ని పక్షాలను భాగస్వామ్యం చేయకపోవడమేమిటనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా మరోమారు వినిపించాయి.
ఇక, విగ్రహ స్వరూపం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు కోరలు కనిపించకుండా ఉన్న మూడు సింహాలు ఇప్పుడు నోరు తెరిచి ఆగ్రహంగా చూస్తున్నాయని, ఇదే మోదీ ప్రభుత్వ నవభారతం అని లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు
https://twitter.com/pbhushan1/status/1546714888642277377
మూడు సింహాల విగ్రహాల రూపు రేఖలు మారడంపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు స్పందించారు. భారత చిహ్నంలో సింహాలు కోపంగా నోరు తెరిచి కోరలు చూపించడం ఎప్పుడు మొదలైందని వారు ప్రశ్నిస్తున్నారు.
https://twitter.com/VinayDokania/status/1546721202688839680
కొందరు నెటిజన్లు మూడు సింహాల గుర్తు ఎప్పుడు ఎలా మారుతూ వచ్చిందో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త విగ్రహం ఆగ్రహంగా కోరలు సాచి కనిపించడం, తొలి నాటి భారతీయ చిహ్నాన్ని అవమానించినట్లుగా ఉందని గుజరాత్ కు చెందిన రచయిత ఉర్వీష్ కొఠారి ట్వీట్ చేశారు.
https://twitter.com/urvish2020/status/1546751136354340864
అవన్నీ అర్థం లేని ఆరోపణలే...
కాగా, బీజేపీ నేతలు ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మీడియాతో అన్నారు.
మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేని వాళ్ళు మాత్రమే మోకాలడ్డే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)