అమ్మ మృతిపై నివ్వెరపోయే కథనం: మెర్సీ కిల్లింగ్!, రెండు కాళ్లు పనిచేయలేదా?
చివరి రోజుల్లో జయలలిత రెండు కాళ్లు పనిచేయలేదని.. దీంతో కాళ్లు లేకుండా జీవించడం తనవల్ల కాదని, కాబట్టి తనను మెర్సీ కిల్లింగ్ చేయాలని జయలలిత శశికళను కోరినట్టుగా పత్రిక పేర్కొంది.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన తమిళ దివంగత సీఎం జయలలిత మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చివరి రోజుల్లో ఆమెకు జరిగిన చికిత్స.. ఆమె ఆరోగ్యంపై పలువురిలో అనుమానాలు నెలకొని ఉన్నాయి. వీటికి బలం చేకూరుస్తూ చివరి రోజుల్లో అమ్మకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
తాజాగా తమిళులు అధికంగా ఉండే మలేషియాలో అక్కడి ఓ దినపత్రిక దీనిపై ఓ షాకింగ్ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 17వ తేదీన ప్రచురితమైన ఈ కథనంలో.. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చివరి రోజుల్లో జయలలిత రెండు కాళ్లు పనిచేయలేదని.. దీంతో కాళ్లు లేకుండా జీవించడం తనవల్ల కాదని, కాబట్టి తనను మెర్సీ కిల్లింగ్ చేయాలని జయలలిత శశికళను కోరినట్టుగా పత్రిక పేర్కొంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కథనం వైరల్ గా మారిపోయింది. సదరు పత్రిక ప్రచురించిన ఈ కథనంలో నిజానిజాల స్థాయి ఎంతన్నది ప్రస్తుతం అందరిలో మెదులుతోన్న ప్రశ్న. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకె బహిష్కృత నేత శశికళ పుష్ప జయలలిత మృతిపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. స్లో పాయిజన్ ద్వారా జయలలితను శశికళే చంపేసి ఉంటారని ఆమె ఆరోపించారు.
ఇక నటి గౌతమి ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాయగా.. మరికొంతమంది దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీంను సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ మృతిపై నెలకొన్న అనుమానాలకు మలేషియా పత్రిక ప్రచురించిన కథనం మరింత ఊతమిచ్చేలా తయారైంది.