ఢిల్లీ లాక్డౌన్: ఇ-పాస్ అవసరమా?: మినహాయింపులు ఎవరికి: లిక్కర్ షాపులు ఫుల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ను విధించింది. ఈ రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 26వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. పాతిక వేల వరకు నమోదవుతోన్న రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా కట్టడికి లాక్డౌన్ను విధించడం మినహా మరో ప్రత్యమ్నాయం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ స్పష్టం చేశారు.
Recommended Video

ఢిల్లీ వెళ్లాలంటే ఎలా?
ఈ పరిణామాల మధ్య ఢిల్లీకి రాకపోకలను సాగించడం పట్ల పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ వెళ్లిన వారికి లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఉన్నాయా? లేవా?, రాకపోకలు సాగించే వారి పరిస్థితేంటీ? వారిని క్వారంటైన్ తరలిస్తారా?, ఇదివరకట్లా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ ఢిల్లీ ప్రభుత్వం సమాధానాలను ఇచ్చింది. కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్ను ప్రకటించింది.

టికెట్ చూపిస్తే..
ఢిల్లీకి రాకపోకలు సాగించే వారికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. విమానాలు, రైళ్లు, అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన వాలిడ్ టికెట్లను చూపించడం ద్వారా లాక్డౌన్ నుంచి మినహాయింపు పొందవచ్చు. దేశ రాజధాని కావడం వల్ల ఇతర దేశాలకు చెందిన రాయబారులు, డిప్లొమాట్లకు రాకపోకలు సాగించడానికి మినహాయింపును ఇచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. వారు తమ గుర్తింపు కార్డులను కూడా చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

హెల్త్ వర్కర్లకు..
ప్రైవేటు మెడికల్ సిబ్బందికి కూడా రాకపోకలు సాగించడానికి వీలు కల్పించింది. వారు తమ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. గర్భిణులు, పేషెంట్లు, వారితో పాటు ఉండే సహాయకులు ఆసుపత్రులకు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు. వారు తమ గుర్తింపు కార్డులు గానీ, డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్కిప్షన్ గానీ చూపించాల్సిన అవసరం లేదు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వెళ్లే వారు, వ్యాక్సిన్ కోసం వెళ్లే వారికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

మీడియా సిబ్బందికీ..
జర్నలిస్టులు, కరెస్పాండెంట్లు, మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు తమ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. అత్యవసరర సర్వీసుల కింద పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వాహనాలకు ఇపాస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులను తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆలయాలు, ఇతర ప్రార్థనా కేంద్రాల్లో యధాతథంగా రోజువారీ పూజా కార్యక్రమాలు, ప్రేయర్లను నిర్వహించడానికి వీలు కల్పించింది ప్రభుత్వం. భక్తులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

మద్యం షాపులు ఫుల్..
మరోవంక- ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అలా లాక్డౌన్ ప్రకటించారో లేదో.. ఇలా మద్యం షాపులన్నీ ఫుల్ అయ్యాయి. మద్యం దుకాణాల ముందు వందలాది మంది బారులు తీరి నిల్చోవడం కనిపించింది. చాణక్యపురి, సివిల్ లైన్స్, గాంధీ నగర్, అలీపూర్, కరోల్ బాగ్, మయూర్ విహార్, ద్వారకా, సాకేత్, కల్కాజీ, నజఫ్గఢ్, పటేల్ నగర్, పంజాబీ బాగ్, రాజౌరీ గార్డెన్.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మద్యం షాపుల ముందు ఢిల్లీ వాసులు బారులు తీరి నిల్చున్నారు. వారానికి సరిపడేంత మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.












Click it and Unblock the Notifications