కేంద్రం, బెంగాల్ మద్య యుద్ద వాతావరణానికి ఆ రెండు స్కాం లే కారణమా..? ఏంటవి..??
కోల్ కత/ హైదరాబాద్ : బెంగాల్లోని తృణమూల్ నేతలను, ప్రభుత్వ ఆధికారులను కేంద్రం సీబీఐ ద్వారా వేధిస్తోందని మమతబెనర్జీ గత కొన్నాళ్లుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీబీఐను తమ రాష్ట్రంలోకి జనరల్ కన్సెంట్ లేకుండా అనుమతించేది లేదని ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది తీసుకున్న ఈ అనుహ్య నిర్ణయంతో సీబీఐ గత కొన్ని నెలలుగా పశ్చిమబెంగాల్లో కాలు పెట్ట లేదు. పలువురు అధికారులు, తృణమూల్ నేతలను ప్రశ్నించేందుకు అనుమతి కోరినా బెంగాల్ ప్రభుత్వం పట్టించుకో లేదు.
చివరికి సీబీఐ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నేరుగా కోల్కత్తా కమిషనర్ రాజీవ్కుమార్ను అరెస్టు చేసేందుకు నిర్ణయించింది. మమతబెనర్జీ కలుగజేసుకోవడంతో ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారింది. అసలు సీబీఐ రాజీవ్కుమార్ను ఎందుకు అరెస్టు చేయాలనుకుంది..? అసలు ఇంతటి వివాదానికి కారణం ఏమిటి..? అని ఆరా తీస్తే రెండు భారీ స్కామ్ లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ కుంభకోణాలపై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం..!
లెక్కలేనంతగా శారదా కుంభకోణం..!తృణమూల్పైకి సీబీఐని కేంద్రం ఉసిగొల్పుతోందంటున్న మమత..!!
శారదా కుంభకోణం..! ఏకంగా ఆరేళ్లుగా పశ్చిమబెంగాల్ను పట్టి కుదిపిస్తోందిది. 2013 ఏప్రిల్లో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో కొన్ని లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు వేలకు వేలు నష్టపోయారు. ఇప్పటివరకు కూడా ఈ కుంభకోణం విలువ ఎంత అనేది లెక్కకట్టలేకపోయారంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు పది లక్షల మంది ప్రజలు నష్టపోయినట్ల అంచనా. ఈ లెక్కన ఈ కుంభకోణం ఏ లక్ష కోట్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బెంగాల్ రాష్ట్రంలో 200 మంది ఇన్వెస్టర్లతో శారదా గ్రూప్ ఏర్పాటు చేసి గొలుసుకట్టు పథకాల పేరిట డబ్బులు వసూలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కంపెనీ వసూళ్లకు పాల్పడింది. 2013 వరకు జరిగిన ఈ మోసం అదే ఏడాది ఏప్రిల్లో వెలుగుచూసింది. దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడం, ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మంతా వేరొక మార్గాలకు మళ్లించడం, నేతలు, అధికారులు కలిసి దాన్ని కాజేయడంతో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ఆరేళ్లుగా కేసు..! తేలని నేరం..!!
2013 ఏప్రిల్ 23న శారద గ్రూపు ఎండీ సుదీప్సేన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో తృణమూల్ నేతలకు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూసింది. అంతేకాదు పశ్చిమబెంగాల్ అప్పటి డీజీపీ రజత్మజుందార్కు బారీఎత్తున ముడుపులు అందాయి. అందుకే ఏకంగా సెబీ, ఆర్బీఐ, ఆదాయపు పన్నుశాఖ, ఆర్థిక శాఖ, ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక ప్రస్తుత సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్కుమార్ను సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే.. ఈయన కూడా స్కామ్లో ముడుపులు అందడంతోపాటు దర్యాప్తును తొక్కి పెట్టారని, తృణమూల్ నేతలను కాపాడారన్న అభియోగాలున్నాయి. అలాగే సీబీఐ కోరిన సమాచారం ఇవ్వకుండా దాచారని, ఆధారాలను నాశనం చేశారని కూడా సీబీఐ చెబుతోంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు ముకుల్రాయ్ కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఆయన్ను సీబీఐ ప్రశ్నించింది.
భారీగా రోజ్వ్యాలీ కుంభకోణం..! త్రుణమూల్ నేతల ప్రమేయం ఉందంటున్న బీజేపి..!!
ఇక రెండో స్కామ్ రోజ్వ్యాలీ కుంభకోణం. ఇది కూడా గొలుసుకట్టు మోసమే. ప్లాట్ల కొనుగోలు, విహార యాత్రలకు తీసుకెళ్ళాలనుకునేవారే లక్ష్యంగా ఈ స్కామ్ జరిగింది. ఇందులో డబ్బులు పొగొట్టుకున్న వారూ మధ్య తరగతి ప్రజలే. సరిగ్గా శారద కుంభకోణం వెలుగు చూసిన 2013 ఏప్రిల్లోనే ఈ కుంబకోణం కూడా వెలుగు చేసింది. ఈ వ్యాపారాన్ని సెబీ చట్టవ్యతిరేకంగా ప్రకటించడంతో కుంభకోణంగా మారింది. మనీ రోటేషన్ నిలిచిపోవడం, స్థిరాస్తిలో పెట్టిన డబ్బు వెనక్కి రాకపోవడంతో ఉన్న డబ్బును అక్రమార్కులు మింగేశారు.రోజ్వ్యాలీ రియల్ ఎస్టేట్, కన్షస్ట్రక్షన్స్, రోజ్వ్యాలీ హోటల్స్ పేరిట కంపెనీలు ఏర్పాటు చేసి 21శాతం వడ్డీ ఇస్తామని డిపాజిట్లను కంపెనీ వసూలు చేసింది.
కుభకోణం సాకుతో కేంద్రం కక్ష్య సాధిస్తోంది..! మండిపడుతున్న మమత..!!
సుమారు 40వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అంచనా.ఇప్పటికే రోజ్వ్యాలీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్కుందూ తోపాటు తృణమూల్ కాంగ్రెస్ నేత తపస్పాల్, సుదీప్బందోపాధ్యాయను సీబీఐ అరెస్టు చేసింది. తమ పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ అరెస్టులు సాగిస్తోందని మమతబెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కుంభకోణం సాకుగా చూపి తృణమూల్ నేతలపై సీబీఐను కేంద్ర ఉసిగొల్పుతోందని మండిపడుతున్నారు. తాజాగా శారద కుంభకోణం సిటీ అధికారిగా వ్యవహరించి, కోల్కత్తా పోలీసు కమిషనర్గా ఉన్న రాజీవ్కుమార్ను అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐను అడ్డుకోవడంతో వివాదం ముదిరి పాకాన పడింది.