ఐఎస్ఐఎస్ టార్గెట్: ఆర్మీ స్థావరాలు, విదేశీయులు
న్యూఢిల్లీ/ముంబై: భారత సైనిక స్థావరాలు, విదేశీయులను లక్షంగా చేసుకుని దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ పథకం వేసిందని మహారాష్ట్ర ఉగ్రవాద నిర్మూలన దళం (ఏటీఎస్) విచారణలో వెలుగు చూసింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, గోవాల్లోని సైనిక స్థావరాలు, విదేశీయులను వీరు లక్షంగా చేసుకున్నారని అధికారులు చెప్పారు. భారత్ లో ఇస్లామిక్ స్టేట్ విభాగం చీఫ్ ముదబీర్ ముస్తాక్ షేక్, తరువాత స్థాయి నాయకుడు (డిప్యూటి) ఖలీద్ అహమ్మద్ ఆలీ నవాజుద్దీన్ అలియాస్ రిజ్వాన్ తో కలిసి షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ పథకం వేశాడు.
ముదబీర్ ముస్తాక్ షేక్, ఖలీద్ అహమ్మద్ ఆలీ నవాజుద్దీన్, షఫీ ఆర్మర్ (సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు) పథకం వేసినట్లు తమ విచారణలో వెలుగు చూసిందని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు వివరించారు.
మహారాష్ట్ర ఏటీఎస్ అధికారుల సమాచారం మేరకు ఆ రాష్ట్రంలో సురక్షితమైన ఇళ్ల కోసం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గాలిస్తున్నారని, గోవాలోని ఓ రియాల్టీ ఏజెంట్ ను సంప్రదించారని విచారణలో వెలుగు చూసింది.
ముంబై, గోవా, పూణెలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై దాడులకు పథకం వేశారని, అదే విధంగా మహారాష్ట్ర, గోవాల్లో విదేశీయులను టార్గెట్ చేసుకున్నారని అధికారులు కనుగొన్నారు. ఇండియన్ ముజాహుద్దిన్ నుంచి బయటకు వచ్చిన షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ ఐఎస్ఐఎస్ లో చేరి భారత్ లోని యువకులను ఇస్లామిక్ స్టేట్ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని అధికారులు తెలిపారు.