ఐసిస్ లింక్, కేరళలో ఆరు మంది అరెస్టు: జడ్జీలు, బీజేపీ టార్గెట్ !
కొచ్చి: భారత్ లో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఆరు మందిని కేరళలోని కోజికోడ్, కణ్ణూరులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరు కేరళ, తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ వేశారని, ఎప్పటికప్పుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అబుబక్కర్ అల్ బాగ్ధాదికి సమాచారం ఇస్తున్నారని అధికారులు గుర్తించారు.
కేరళలో ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ బలపడుతుందని కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు అంటున్నాయి. కేరళలో విధ్వంసాలు సృష్టించే స్థాయికి ఎదుగుతున్నదని అధికారులు గుర్తించారు.
నియామకాల దశ నుంచి హిట్ లిస్ట్ తయారు చేసి అరాచకాలు సృష్టించాలని ఐఎస్ఐఎస్ ప్లాన్ వేస్తున్నదని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ), కేరళ పోలీసులు, ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) త్వరలోనే సమావేశం అవుతున్నారని తెలిసింది.
ఐసిస్ ఆపరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. కేరళ నుంచి ఆరు మంది మహిళలు, ముగ్గురు పిల్లలతో సహ 21 మంది అఫ్ఘన్ మీదుగా సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులలో చేరారని సమాచారం రావడంతో అధికారులు ఆదిశగా దృష్టి సారించారు.
కేరళలో ఐసిస్ మాడ్యూల్స్ హిట్ లిస్టు తయారు చేశారని అధికారులు అంటున్నారు. కేరళలో బీజేపీ బలపడటానికి కారణం అయిన ఆ పార్టీ నేతలు రాజశేఖరన్, సురేంద్రన్ లను హిట్ లిస్టులో చేర్చారని అధికారులు చెబుతున్నారు.
వీరి హిట్ లిస్టులో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని వెలుగు చూసింది. ఆ న్యాయమూర్తులు సెషన్స్ కోర్టు జడ్జీలుగా ఉన్న సమయంలో సంచలనాత్మక కేసుల్లో తీర్పులు ఇచ్చారని ఆరోపిస్తూ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు.
అదే విధంగా పోలీసు అధికారి ఉన్నిరాజన్ మువత్తపురులో పని చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి చేతిని నరికిన కేసు దర్యాప్తు చేశారని ఆయన మీద గురి పెట్టారు. కేరళలో మత ఘర్షణలు సృష్టించడానికి 12 లక్షాలను నిర్ణయించారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఐసిస్ మాడ్యూల్స్ ఉపయోగిస్తున్న టెలిగ్రామ్ యాప్ నుంచి ఈ వివరాలు సేకరించినట్లు వెలుగు చూసింది. ఐసిస్ మాడ్యూల్స్ లోని సభ్యులు నకిలీ పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్లు తెరుస్తున్నారని, సైబర్ స్పేస్ తనిఖీలు చేసే అధికారుల నుంచి తప్పించుకోవడానికి తరచూ వీరు గ్రూపులను మార్చుతున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.