నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్-08: జిశాట్ ఎఫ్6తో ఎన్నో ఉపయోగాలు
Recommended Video
శ్రీహరికోట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08ను గురువారం సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లింది. షార్ నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-6ఏను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. జీశాట్-6ఏ ఉప్రగహం ద్వారా కమ్యూనికేషన్ రంగం కొత్త పుంతలు తొక్కనుంది.
జీఎస్ఎల్వీ ఎఫ్08 ప్రయోగానికి సంబంధించి అంతకుముందు రోజు బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27 గంటలపాటు కొనసాగింది. అనంతరం గురువారం సాయంత్రం సరిగ్గా 4.56 గంటలకు జీఎస్ఎల్వీ వాహక నౌక షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగం జరిగిన తర్వాత రాకెట్ నిర్ణీత కక్ష్యలో జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని చేర్చడానికి 17.46.50 నిమిషాల సమయం పట్టింది. భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో దీన్ని శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు. అంటే కక్ష్యలో భూమికి సమీప బిందువు(పెరిజీ) 170 కి.మీ., దూరంగా ఉండే బిందువు (అపోజీ) 35,975 కి.మీ. ఉంటుంది. 20.63 డిగ్రీల వాలులో ప్రవేశ పెట్టిన ఉపగ్రహాన్ని రోజుల వ్యవధిలో అందులోని ఇంధనాన్ని మండించి కక్ష్య మారుస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండే భూస్థిర కక్ష్ల్యలోకి పంపిస్తారు.