నా కోరిక నెరవేరలేదు: సైనికులకు మోడీ సెల్యూట్
చండీగఢ్: తనకు చిన్నప్పుడే సైన్యంలో చేరాలనే కోరిక ఉండేదని, సైనిక్ స్కూల్లో చదువుకోవాలన్న తన ఆకాంక్ష నెరవేరలేదని గుజరాత్ ముఖ్యమంత్రి, ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. హర్యానాలోని రేవారిలో జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ ర్యాలీలో విశ్రాంత జనరల్ వికె సింగ్ పాల్గొన్నారు. మోడీ మాజీ సైనికులను ఉద్దేశించి మధ్యాహ్నం ప్రసంగించారు.
దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న త్యాగమూర్తులు జవాన్లు అన్నారు. సైనికులకు తన వందనాలు చెబుతున్నానన్నారు. ఉత్తరాఖండ్ విపత్తులో సైనికుల సేవలు మరువలేనివన్నారు. అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. మాజీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం తనకు ఇదే తొలిసారి అని చెప్పారు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఈ ర్యాలీలో పాల్గొనండం తనకు ఎంతో సంతోషానిస్తుందన్నారు.
మోడీ భారత్ మాతాకి జై అని నినదించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాజీ సైనికోద్యోగులు కూడా అవే నినాదాలు చేశారు. 1962లో యుద్ధం వచ్చినప్పుడు తాను సైన్యానికి టీ, భోజనం ఇచ్చేందుకు వెళ్లానని, అప్పుడు వారి పాదాలను తాకానన్నారు. సైనికుల సేవలు మరువలేనివన్నారు. 2001లో భూకంపం సంభవించినప్పుడు వారు సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో పలువురు సైనికలు ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు.
ఇటీవల సరిహద్దు ఉద్రిక్తలపై కేంద్రమంత్రి ఆంటోని చేసిన వ్యాఖ్యలపై మోడి మండిపడ్డారు. మన సైనికులు ప్రజలకు సహాయం చేస్తున్నారని, పాకిస్తాన్ సైనికుల చేతుల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆంటోని మాత్రం పాకిస్తాన్ సైనికులు కాదని, పాక్ సైనికుల దుస్తుల్లో ఉన్న తీవ్రాదులు అని చెప్పడం విడ్డూరమన్నారు. యుపిఏ ప్రభుత్వం సరిహద్దు ఉద్రిక్తతపై స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు.
అసలు సమస్య సరిహద్దుల్లో లేదని ఢిల్లీలో ఉందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ పాలన పాలసీలు సరిహద్దుల్లో ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడ్డాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సైనాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తోందని, బిజెపి అలా చేయదన్నారు. అధికార పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రస్తుత యువతరం ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనబర్చడంలేదని, దానిని మార్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.