శరద్ పవార్కు కష్టాలు షురూ: లవ్ లెటర్..పాత కేసులు తవ్వి తీస్తోన్న షిండే సర్కార్
ముంబై: మహారాష్ట్రలో కొద్దిరోజుల కిందట ఆరంభమైన రాజకీయ సంక్షోభం.. అక్కడి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ కూటమి సర్కార్ ఊహించినట్టే పతనమైంది. తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన-భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం అయ్యారు.

శరద్ పవార్కు ఐటీ నోటీసులు..
మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన మరుసటి రోజే- అందులోని భాగస్వామ్య పార్టీలకు కష్టాలు మొదలయ్యాయి. పాత కేసులన్నీ తిరగదోడే పరిస్థితి ఏర్పడింది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం రాజకీయ వేధింపులకు తెర తీసినట్టే కనిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజే- ఐటీ అధికారులు ఈ నోటీసులను ఆయనకు పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శరద్ పవార్ సహా..
అవన్నీ పాతకేసులే కావడం చర్చనీయాంశమైంది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లను ఆధారంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ నోటీసులను పంపించారు. ఆయనకు ఒక్కరికే కాదు.. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకూ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని శరద్ పవార్ ధృవీకరించారు. తనతో పాటు తమ పార్టీకి చెందిన కొందరు శాసన సభ్యులకు ఆదాయపు పన్నుశాఖ అధికారుల నుంచి నోటీసులు అందినట్లు చెప్పారు.

లవ్ లెటర్ అందింది..
ఈ మేరకు ఆయన ఈ ఉదయం తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్పై దీనికి సంబంధించిన సమచారాన్ని పోస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థులపై అధికార పార్టీ నాయకులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్రీయ దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే సంప్రదాయం ఇప్పుడూ కొనసాగిందని పేర్కొన్నారు. ఐటీ అధికారుల నుంచి తనకు లవ్ లెటర్ అందిందని కామెంట్స్ చేశారు.

అఫిడవిట్ల ఆధారంగా..
ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఇప్పుడు తనకు నోటీసులు అందాయని, ఇన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వాటిని ఎందుకు తవ్వి తీయాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతల ప్రజలు కూడా ఈడీ, ఐటీ అధికారుల నోటీసుల గురించి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయనేది వారికి కూడా తెలుసని కామెంట్స్ చేశారు.
Recommended Video


2004 నుంచీ..
2004లో మాత్రమే కాదు.. 2009 లోక్సభ ఎన్నికల్లోనూ తాను పోటీ చేశానని గుర్తు చేశారు. 2014, 2020 రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ అఫిడవిట్ దాఖలు చేశానని చెప్పుకొచ్చారు. అదృష్టం బాగుండి వాటికి సంబంధించిన వివరాలన్నీ తాను భద్ర పరిచానని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ కక్షసాధింపు చర్యలకు ఇక్కడితో అడ్డుకట్ట పడకపోవచ్చని, ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనడానికి సెంట్రల్ ఏజెన్సీలను వినియోగించడాన్ని అలవాటుగా మార్చుకుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications