ఆ పెన్డ్రైవ్లో జయలలిత డెత్ సీక్రెట్?: ఏం బయటపడుతుందో.. అందరి దృష్టి దానిపైనే!
ఆ వీడియో క్లిప్పింగ్స్ లో జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Recommended Video
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై ఇప్పటికీ తొలగిపోని అనుమానాలెన్నో. చివరి రోజుల్లో ఆమె వాస్తవ పరిస్థితి గురించి ఎరిగినవాళ్లలో శశికళ తప్ప మరొకరు లేరు.
ఎవరీ పూంగుండ్రన్?: శశికళ కుటుంబాన్ని ఐటీ టార్గెట్ చేయడం వెనుక.., మొత్తం చెప్పేశాడు!
నిజానికి జయలలిత అంతరంగీక జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయంటారు. అవేవి ఇప్పటికైతే బయటపడలేదు. కనీసం ఆమె చివరి రోజుల్లో ఎలా ఉన్నారన్న దానికి సంబంధించి ఫోటోలు గానీ వీడియోలు గానీ బయటకు రాలేదు. అయితే వేద నిలయంలో తాజాగా ఐటీ అధికారులు చేసిన దాడుల్లో జయలలిత చివరి రోజుల్లోని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నపెన్ డ్రైవ్ ఒకటి దొరికందట.
ఆసుపత్రికి తరలించే సమయంలో:
వేదనిలయం తనిఖీల్లో భాగంగా జయలలిత వ్యక్తిగత సహాయకుడు పూంగుండ్రన్, నెచ్చెలి శశికళ గదుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు ఒక పెన్డ్రైవ్ లభ్యమైనట్టు తెలుస్తోంది. పెన్డ్రైవ్లో జయను ఆస్పత్రికి తరలించే గంటముందు నమోదైన సీసీటీవీ దృశ్యాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది.
అపస్మారక స్థితిలో:
ఆసుపత్రికి తరలించే సమయానికే జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లారన్న ప్రచారానికి పెన్ డ్రైవ్ లోని దృశ్యాలు బలాన్ని చేకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వీడియో క్లిప్పింగ్స్ లో జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శశికళను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తూ వస్తున్న ఐటీ అధికారులు.. నాలుగు రోజుల క్రితం వేద నిలయంలో దాడులు చేశారు.
లండన్ డాక్టరుకు సమన్లు:
జయ మృతిపై ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పాలంటూ జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. బుధవారం విచారణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో జయకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలందించిన లండన్ డాక్టర్ బీలే సహా అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
డెత్ సీక్రెట్?:
ఐటీ అధికారుల వద్ద ఉన్న పెన్డ్రైవ్ పైనే ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది. ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?.. అన్న సందేహానికి అందులో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. పెన్డ్రైవ్ లో మరేదైనా కీలక సమాచారం బయటపడుతుందా? అన్న ఉత్కంఠ కూడా మొదలైంది.
జయలలిత మృతిపై విచారణలో భాగంగా అవసరమైతే ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మరికొంతమంది మంత్రులను విచారించాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.