తమిళనాట మళ్లీ కలకలం: దినకరన్ గెలిచాక.. శశికళ ఫ్యామిలీ కంపెనీలపై సోదాలు
చెన్నై: తమిళనాడులో మరోసారి ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం చిన్నమ్మ శశికళ కుటుంబ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించింది. మిథాస్ లిక్కర్ కంపెనీ, సాయి ఎంటర్ ప్రైజెస్ కంపెనీల్లో సోదాలు జరిగాయి.
గత నెల 185 ప్రాంతాల్లో ఏడు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం.
కక్ష సాధింపు చర్య
ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్ విజయం సాధించారు. ఈ విజయం తర్వాత రెండు మూడు రోజులకే సోదాలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అని దినకరన్ వర్గం భావిస్తోంది.
దినకరన్ వర్గం మౌనం
ఐటీ సోదాలపై ప్రస్తుతానికి దినకరన్ వర్గం మౌనంగా ఉంది. గతంలో సోదాలు చేయడం, తిరిగి ఇప్పుడు చేయడం అంతా కుట్రలో భాగంగానే చేస్తున్నారని చిన్నమ్మ వర్గం భావిస్తోంది. మొన్ననే గెలిచిన సందర్భంలో ఇప్పుడు సోదాలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వరుసగా రెండోసారి
శశికళ ఆస్తులు, ఆమె కుటుంబ ఆస్తులపై ఐటీ అధికారులు సోదాలు చేయడం ఇటీవలి కాలంలో వరుసగా రెండోసారి కావడం గమనార్హం. ఆర్కే నగర్లో దినకరన్ వర్గం గెలుపు నేపథ్యంలో చిన్నమ్మ వర్గం ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
దినకరన్ వైపు కొందరు నేతలు
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలవడంతో అన్నాడీఎంకేలోని ఒకరిద్దరు నేతలు దినకరన్ వైపు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పలువురిపై అన్నాడీఎంకే వేటు వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి సోదాలు జరగడం గమనార్హం.