12 మంది మంత్రులపై ఐటీ నిఘా: పక్కాగా, శశికళ వర్గం గుండెల్లో రైళ్లు!
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న శశికళ వర్గంలోని అన్నాడీఎంకే అమ్మ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు నిఘా వేశారని వెలుగు చూసింది. తమిళనాడులో దాడులు ఇంకా పూర్తి కాలేదని సోమవారం ఐటీ శాఖ అధికారులు స్వయంగా చెప్పడంతో శశికళ వర్గీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
తమిళనాడు ప్రభుత్వంలోని 12 మంది మంత్రుల మీద గత వారం రోజుల నుంచి ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారు. అంతేకాకుండా శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల మీద కన్ను వేశారు. అందులో భాగంగానే ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద ఐటీ అధికారులు దాడులు చేశారని తెలిసింది.

ఎక్కడికి వెలుతున్నారు ?
ఇప్పటికే ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గం మీద ఆదాయపన్ను శాఖ అధికారులు నిఘా వేశారు. వారు ఎక్కడికి వెలుతున్నారు ? ఏమి చేస్తున్నారు ? అని ఆరాతీస్తున్నారు.

ఆర్ కే నగర్ లో ప్రచారం చేసింది ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా అక్కడికి వెళ్లి దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ? అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట ఆర్ కే నగర్ ప్రాంతంలో బసచేసిన మంత్రులు, ఎమ్మెల్యేల వివరాలు సేకరిస్తున్నారు.

మంత్రి నోరు విప్పితే అంతే
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సోమవారం ఐటీ శాఖ అధికారులు ముందు హాజరైనారు. మంత్రి విజయభాస్కర్ నొరువిప్పితే అనేక మంది జాతకాలు బయటకు వస్తాయని శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.

పూర్తి వివరాలు సేకరిస్తున్నారు
మంత్రి విజయభాస్కర్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న నగదు, విలువైన పత్రాలు గురించి ఆయన దగ్గర ఐటీ శాఖ అధికారులు వివరణ తీసుకున్నారని సమాచారం. మంత్రి విజయభాస్కర్ తండ్రి చినతంబి, ఆయన సొదరుడు ఉదయ్ కుమార్ లను ఇప్పటికే విచారించిన ఐటీ శాఖ అధికారులు పలు వివరాలు సేకరించారు.

దినకరన్ ను విచారించే అవకాశం ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ ను ఐటీ శాఖ అధికారులు విచారించే అవకాశం ఉందని సమాచారం. దినకరన్ కు మద్దతుగా ఓటు వెయ్యాలని ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు రూ. 89 కోట్లు స్థానిక ఓటర్లకు పంచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications