రూ.2 వేల నోట్ల 'హోమ్ డెలివరీ'పై మొదలైన ఐటి దర్యాప్తు!
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే ముద్రణాలయాల నుంచే నేరుగా బడా బాబుల ఇళ్ళకు కొత్త నోట్ల కట్టలు ఎలా చేరాయన్న దానిపై ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ.
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత సామాన్యుడి కష్టాలు జగమెరిగిన సత్యం. పగలనకా.. రాత్రనకా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లో నిలబడి సామాన్యులు పడ్డ బాధలు వర్ణనాతీతం.
మరోవైపు బడా బాబులు ఎవరూ ఈ క్యూలలో కానరాలేదు. దేశంలో కొన్ని చోట్ల సాక్షాత్తు లక్ష్మీదేవి రూ.2 వేల నోట్ల కట్టల రూపంలో కొంతమంది అక్రమార్కుల ఇళ్లకే తరలిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే బడా బాబుల ఇళ్ళకు కొత్త నోట్ల కట్టలు చేరిపోయాయి. ఈ నోట్లు ముద్రణాలయాల నుంచే నేరుగా నోట్ల మార్పిడి ముఠాల చేతుల్లోకి వెళ్ళాయి.
ఈ అక్రమాలపై ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఢిల్లీ లో రూ.20 లక్షల విలువైన రూ.2,000 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై మహారాష్ట్ర, పశ్చిమ్ బంగలోని ముద్రణాలయాల సీల్ లను గుర్తించారు.
ఈ విధమైన సీల్ లతో నోట్ల కట్టలు బయటికి రావడం ఇదే తొలిసారి అని ఐటి శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆర్బీఐ చెస్ట్ లోగాని, ప్రింటింగ్ ప్రెస్ లోగాని లోపం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఆర్బీఐ ఇప్పటివరకు స్పందించ లేదు.