మంత్రి డీకే. శివకుమార్ కు ఐటీ శాఖ మరోసారి షాక్, సన్నిహితుడు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు !
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు మరో సారి షాక్ ఇచ్చారు.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు మరో సారి షాక్ ఇచ్చారు. డీకే. శికుమార్ కు అత్యంత సన్నిహితుడు, కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యక్షుడు లక్ష్మణ్ ఇల్లు, కార్యాలయాల్లో మంగళవారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
బెంగళూరులోని సదాశివనగర, బసవేశ్వరనగర లోని లక్ష్మణ్ ఇల్లు, కార్యాలయాల్లో ఒకే సారి దాడులు మొదలు పెట్టారు. మంత్రి డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో బసచేసిన సమయంలో మంత్రి డీకే. శివకుమార్ వారికి అండగా ఉన్నారు. ఆ సందర్బంలో మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
అప్పటి నుంచి డీకే. శివకుమార్ సన్నిహితుల మీద వరుసగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. డీకే. శివకుమార్ అనుచరులకు ఆదాయపన్ను శాఖ అధికారులు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇంకా ఎంత మంది ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులకు గురౌతారో అంటూ చర్చ మొదలైయ్యింది.