అలా చేస్తే పన్నీరు సెల్వం గొప్ప నాయకుడయ్యేవారు: స్వామి సంచలనం
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సీఎం పన్నీరు సెల్వంపై విమర్శలు చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సీఎం పన్నీరు సెల్వంపై విమర్శలు చేశారు. పన్నీరు సెల్వం ఓ రబ్బరు స్టాంప్ అంటూ ఆరోపణలు చేసిన ఆయన.. శశికళపై సెల్వం చేసిన విమర్శలను తప్పుబట్టారు.
శశికళ ప్రమాణంపై జాప్యమెందుకు?: గవర్నర్పై సుబ్రమణ్యస్వామి షాకింగ్ కామెంట్స్
'రాజీనామా చేసిన తర్వాతే శశికళపై ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రాజీనామా చేయకుముందే తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని చెబితే సెల్వం గొప్ప నాయకుడు అయ్యేవారు' అని ఓ మీడియా ఛానల్తో సుబ్రమణ్యస్వామి అన్నారు.
అంతేగాక, 'శశకళను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నవారిలో సెల్వం లేరా? ' అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడంతా చేయి జారాక ఆయన మాట్లాడటం సరికాదని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు.
శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందన గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని కోరారు. ఈ విషయంపై తాను ఇప్పుడే రాష్ట్రపతిని కలిశానని, తమిళనాడు రాజకీయ పరిణామాలు వివరించానని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ బాధ్యతల విషయంపై కూడా రాష్ట్రపతితో చర్చించినట్లు తెలిపారు.