వారణాసిలో మోడీ వర్సెస్ అజయ్ రాయ్! ప్రియాంక పోటీపై వీడిన సస్పెన్స్!
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీపై సస్పెన్ వీడింది. మోడీకి ప్రత్యర్థిగా ఆమె బరిలో నిలవడంలేదని తేలిపోయింది. గత ఎన్నికల్లో మోడీపై పోటీ చేసిన వ్యక్తికే ఈసారి కూడా అవకాశమివ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. వారణాసి లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ అజయ్రాయ్ పేరును ఖరారు చేసింది.

వీడిన సస్పెన్స్
వారణాసి నుంచి మోడీకి ప్రత్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. వారణాసి నుంచి ఎందుకు పోటీచేయకూడదు అంటూ ప్రియాంక ప్రశ్నించడం, అన్న ఆదేశిస్తే అక్కడి నుంచిపోటీ చేస్తానని చెప్పడంతో ఆమె బరిలో దిగడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ చేసిన ప్రకటనతో కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ వీడింది.

2014లో మూడో స్థానంలో అజయ్
గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం అజయ్ రాయ్, నరేంద్రమోడీపై పోటీ చేశారు. అప్పట్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రత్యర్థిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం 75వేల ఓట్లతో అజయ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

బరిలో ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి
చివరి దశలో మే 19న ఎన్నికలు జరగనున్న వారణాసిలో ఏప్రిల్ 29 వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. ఎస్పీ - బీఎస్పీ కూటమి ఇప్పటికే తమ అభ్యర్థిగా షాలినీ యాదవ్ను పోటీలో నిలిపారు.
ఈ నేపథ్యంలో వారణాసిలో ఈసారి కూడా మళ్లీ త్రిముఖ పోటీ నెలకొననుంది.












Click it and Unblock the Notifications