విభజన: ఢిల్లీ వేదిక, ఎస్మా ప్రయోగానికి ఆదేశం?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నికలకు ముందో, తర్వాతో త్వరలోనే తేలుతుందని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. తెలంగాణపై తాము వెనక్కి తగ్గబోమని ఆయన అన్నారు. తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం కాలపరిమితిని కావాలనే తొలగించామని ఆయన చెప్పారు. చర్చలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడం వల్లనే కాలపరిమితిని తొలగించామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సీమాంధ్రలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని (ఎస్మా)ను ప్రోయగించాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. ఆందోళనకారులతో తమ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఆందోళనలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్మాను ప్రయోగించాలని ఆయన అన్నారు.
కాగా, రాష్ట్ర విభజన వివాదానికి ఢిల్లీ కేంద్రంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎపి భవన్లో దీక్ష చేస్తున్నారు. ఆయన కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జాతీయ పార్టీల నాయకులను కలుసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. జగన్ హైదరాబాదులో దీక్ష చేస్తుండగా ఆమె బుధవారంనాడు బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలుసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు.
వైయస్ జగన్ దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఎపి భవన్లో దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంతో తమకు ఏ విధమైన సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఎపి భవన్ను ఖాళీ చేయాలని అధికారులు చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంపై వివాదం తలెత్తింది.
మరోవైపు, ఎపి ఎన్జీవోలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విభజన జరగదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా సమ్మెను విరమించడానికి ఎపిఎన్జీవోలు నిరాకరించారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఓ జాతీయ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తారనే ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. సంప్రదింపులు జరిపిన తర్వాతనే తెలంగాణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.