CBSE పరీక్ష ఫలితాలు ఎప్పుడు..? మిగతా పరీక్షల నిర్వహణ సాధ్యమేనా.. సెక్రటరీ ఏం చెబుతున్నారు..?
న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలకు తాళం పడింది. ఇక కీలకమైన పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ అంతా బాగుండి ఉంటే ఇప్పటికల్లా పదవ తరగతి పరీక్షలు పూర్తయి పిల్లలు హాలీడేస్ను ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అనే టెన్షన్ విద్యార్థుల్లో ఉంది. అందుకే ఇళ్లకే పరిమితమై చదువుకుంటున్నారు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన చేసింది.
కరోనావైరస్ మహమ్మారితో విద్యావ్యవస్థ కూడా దెబ్బతినింది. ఇటు పరీక్షలు నిర్వహించలేక ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇక ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. అయితే వీటి ఫలితాలపై సీబీఎస్ఈ సెక్రటరీ అనురాగ్ త్రిపాఠీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే సమాధాన పత్రాలను దిద్దడం మొదలు పెట్టినట్లు చెప్పిన ఆయన... లాక్డౌన్ పరిస్థితితో మధ్యలోనే నిలిపివేశామని చెప్పారు. ఇక సీబీఎస్ఈ 2020 ఫలితాలు విడుదల చేసేందుకు మరో 1 నుంచి 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఇంకా 70శాతం సమాధానా పత్రాలను దిద్దాల్సి ఉందని అనురాగ్ త్రిపాఠీ వివరించారు.

ఇక విద్యార్థులు తమ ఫలితాల గురించి ఆందోళన లేదా కంగాను పడాల్సిన అవసరం లేదని త్రిపాఠీ చెప్పారు. విద్యార్థుల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థలపై ప్రభావం చూపిందని చెప్పారు. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందకూడదని సూచించారు. ఇదిలా ఉంటే మధ్యలో నిలిచిపోయిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. మొత్తం 12 సబ్జెక్టులకుగాను మే 3 తర్వాత 10 రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. అది కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే జరుగుతుందని అదే సమయంలో లాక్డౌన్ పొడిగింపు ఉండదని స్పష్టమైన ప్రకటన వస్తేనే పరీక్షల నిర్వహణకు సాధ్యమవుతుందని చెప్పారు.
ఇదిలా ఉంటే 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులను వారి ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగా ప్రమోట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈమేరకు పలు విజ్ఞప్తులు కూడా చేసింది. ఇదిలా ఉంటే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. అక్కడ హింసాత్మక వాతావరణం చోటుచేసుకోవడంతో పరీక్షలు వాయిదాపడ్డాయి.












Click it and Unblock the Notifications