ఇక 'రిసార్టు' రాజకీయం మొదలవచ్చు?: ఎమ్మెల్యేలను తరలించే యోచనలో బీజేపీ..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనూహ్య పరిణామాలను తెర మీదకు తెచ్చాయి. కన్నడ ఓటరు ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీని కట్టబెట్టకపోవడంతో.. అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే గవర్నర్ వజూభాయ్ వాలా అవకాశమిస్తారా?.. లేక కాంగ్రెస్, జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వజూభాయ్ వాలా ఆ పార్టీకే అనుకూలంగా వ్యవహరించవచ్చునని అంటున్నారు. అదే జరిగితే యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. బలనిరూపణ కోరవచ్చు. గవర్నర్ ఇచ్చే గడువు లోగా బలనిరూపణకు బీజేపీ సమాయత్తమవుతుంది. అయితే ఈ గడువు లోగా ఎమ్మెల్యేలు ఎవరూ చేజారకుండా ఉండేందుకు బీజేపీ 'రిసార్టు' రాజకీయం నడపనున్నట్టు సమాచారం.
గవర్నర్ బలనిరూపణకు అవకాశం ఇస్తే.. ఆ మరుక్షణమే ఎమ్మెల్యేలందరిని రిసార్టుకు తరలించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటకు సిద్దపడిన నేపథ్యంలో.. జేడీఎస్ ను చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో.. సొంత పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా చూసుకోవాలనేది బీజేపీ ఆలోచన.
కాగా, కర్ణాటకలో రిసార్టు రాజకీయాలు కొత్తేమి కాదు. గత రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ కు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఇక్కడి రిసార్టుల్లోనే ఉంచింది. బీజేపీ ప్రలోభాలకు చిక్కకుండా ఉండేందుకే ఎమ్మెల్యేలందరిని రిసార్టుల్లో దాచేసింది.
1984లో తొలిసారిగా ఈ రిసార్టు రాజకీయాలకు తెరలేచిందని చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న కాలంలో.. నాదేండ్ల భాస్కర్ రావు ఆయనపై తిరుగుబాటు చేశారు. గుండె ఆపరేషన్ నిమిత్తం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి వచ్చే లోపు ఎమ్మెల్యేందరిని తనవైపు తిప్పుకుని, గవర్నర్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. తనకు బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడంతో గవర్నర్ అందుకు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలందరిని తీసుకెళ్లి కర్ణాటకలోని దేవనహళ్లి రిసార్టులో ఉంచారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్దే ఇందుకు సహకరించారు.
ఆ తర్వాతి కాలంలో 2002లో మహారాష్ట్ర సీఎం విలాసారావ్ దేశ్ ముఖ్ కూడా.. ఒకానొక సందర్బంలో తన ఎమ్మెల్యేలందరిని కర్ణాటక రిసార్టుకు తరలించారు.
ఇక 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పుడు కూడా జేడీఎస్ తన ఎమ్మెల్యేలందరిని ఇలాగే రిసార్టుకు తరలించింది. కాంగ్రెస్ తో సంకీర్ణ ప్రభుత్వానికి చర్చలు ముగిశాకే ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చారు. 2006లొ బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనూ కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలందరిని రిసార్టుకు తరలించారు.
ఇక 2008లో బీజేపీ కూడా ఇదే ఫార్మూలాను ఫాలో అయింది. 110సీట్లతో మేజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆగిపోయిన బీజేపీ.. స్వతంత్ర ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకునేందుకు.. వారిని రిసార్టుకు తరలించింది. మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ రాజకీయం నడిచింది.
After the rough and tumble of the #KarnatakaVerdict, we invite all the MLAs to unwind at the safe & beautiful resorts of God's Own Country. #ComeOutAndPlay pic.twitter.com/BthNZQSLCC
— Kerala Tourism (@KeralaTourism) May 15, 2018
ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుత కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలు 'హంగ్' అని తేలడంతో ఎమ్మెల్యేల బేరసారాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓవైపు కాంగ్రెస్ జేడీఎస్, మరోవైపు బీజేపీ ఎవరికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో గెలిచిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే రిసార్టులకు భారీ డిమాండ్ ఏర్పడిందంటున్నారు.
బహుశా ఇది గమనించే కాబోలు.. అటు కేరళ రాష్ట్ర టూరిజం శాఖ కూడా కర్ణాటక ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికింది. 'కర్ణాటక ఫలితాలు హోరాహోరీగా వెలువడ్డ నేపథ్యంలో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేరళ రిసార్టులకు ఆహ్వానిస్తున్నాం.' అంటూ కేరళ టూరిజం శాఖ ఓ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications