టూరిస్టుల తీరుపై ప్రధాని మోదీ ఆందోళన... పర్యాటకానికి ఇది సమయం కాదంటూ...
కరోనా పట్ల నిర్లక్ష్యం తగదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. చాలామంది టూరిస్టు ప్రదేశాల సందర్శనకు వెళ్తున్నారని... ఇది సరైనది కాదని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు లేకుండా తిరగడం సరికాదని.. మార్కెట్ ప్రదేశాల్లో గుంపులుగా చేరవద్దని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అక్కడి కరోనా పరిస్థితులపై మంగళవారం(జులై 13) నిర్వహించిన సమీక్షా సమావేశంలో మోదీ మాట్లాడారు.
'కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో... లేదా థర్డ్ వేవ్ రాకముందే ఒకసారి టూరిస్టు ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం... మన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉండకూడదు. పరిస్థితిని అర్థం చేసుకుని థర్డ్ వేవ్ రాకుండా నివారించగలిగాలి. పర్వత ప్రాంతాల్లో టూరిస్టులను చూస్తుంటే నాకు ఆందోళన కలుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మనం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.' అని మోదీ స్పష్టం చేశారు.ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లోని టూరిస్టు ప్రదేశాలకు జనం పోటెత్తుతుండటాన్ని మోదీ తప్పు పట్టారు.ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.
వైరస్ నియంత్రణకు మైక్రో లెవల్లో చర్యలు అవసరమని... టెస్ట్-ట్రాక్-ట్రీట్ ఫార్ములాను కచ్చితంగా అమలుచేయాలని మోదీ సూచించారు. ఏడాది కాలంగా కరోనాపై భారత్ ఇదే సూత్రంతో పోరాడుతోందని... కేవలం దీని ద్వారానే వైరస్ను జయించగలమని తెలిపారు.
మోదీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో అసోం,మణిపూర్,మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్,మిజోరాం,నాగాలాండ్,సిక్కీం,త్రిపుర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
నైనిటాల్,ముస్సోరి లాంటి పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పర్వత ప్రాంతాల్లో టూరిస్టుల రాకపోకలు ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. గత వీకెండ్లో దాదాపు 4వేల టూరిస్టు వాహనాలను ఉత్తరాఖండ్ పోలీసులు వెనక్కి పంపించారు. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తేశారో లేదో అక్కడికి టూరిస్టులు పోటెత్తుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటకీ టూరిస్టులు వాటిని పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.