ఎప్పటికైనా ఒక్కటి: జగన్ ఎమ్మెల్యే, తెలంగాణపై ఒమర్
హైదరాబాద్: విడిపోయిన రాష్ట్రం మళ్లీ ఎప్పటికైనా ఒక్కటవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయచోటి శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.
రాయలసీమకు అన్యాయం జరిగితే తాము ఊరుకోమని హెచ్చరించారు. కడప, బెంగళూరు రైల్వే లైన్కు చంద్రబాబు సహకరించాలని కోరారు. జమ్ముకాశ్మీర్ తరహాలో ఆంధ్రప్రదేశ్కు రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బలోపేతం చేయాలి: జగన్
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తెలంగాణ నేతలకు సూచించారు. పార్టీ కార్యాలయంలో తలంగాణ అడ్ హక్ కమిటీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్ రెండు ప్రాంతాల ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఒమర్ అబ్దుల్లా శుభాకాంక్షలు
29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభినందన సందేశాన్ని అందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్కు తమిళనాడు గవర్నర్ రోశయ్య శుభాకాంక్షలు తెలిపారు.