గవర్నర్ను కలిసిన ముఫ్తీ... ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ గవర్నర్ను బుధవారం ఉదయం పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కలిశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాతో మంతనాలు జరిపారు. అనంతరం ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు తొందర ఏమీ లేదని అన్నారు.
పీడీపీకి ప్రస్తుతం 55 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎనలేని గౌరవం అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వారితోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారం కోసం ఎవరితో పడితే వారితో కలవమని అన్నారు. ఇటీవల జరిగిన కాశ్మీర్ ఎన్నికల్లో పీడీపీ 28 స్ధానాలను దక్కించుకోని అతి పెద్ద పార్టీగా అవతరించింది.
25 సీట్లను గెలుచుకుని బీజేపీ రెండో పార్టీగా అవతరించింది. మొత్తం 87 మంది సభ్యులున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బలనిరూపణకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవరసరం. ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడిచిన ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనుమానాలు మాత్రం ఇంకా తీరలేదు.
జమ్మూలో రాజకీయ ప్రతిష్టంభన తొలగించేందుకు ఇంతవరకు ఎలాంటి పరిష్కారంతో తాము సిధ్దం కాలేదని పీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి అఖ్తర్ తెలిపారు. మరోవైపు పీడీపీకి మద్దతు ఇవ్వడానికి నేషనల్ కాన్పరెన్స్ తీర్మానించిందని ప్రచారంలోకి వచ్చినా నేషనల్ కాన్పరెన్స్ అధికార ప్రతినిధి అలీ మహ్మాద్ సాగర్ దాన్ని ఖండించాడు.
బీజేపీతో కలిసి వెళ్లే విషయంలో పీడీపీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మ మంగళవారం గవర్నర్ వోహ్రాను కలిసినప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితుల్ని చర్చించినట్లు తెలుస్తోంది.
బీజేపీ తరుపున తమ ప్రతిపాదనను జనవరి ఒకటో తేదీన గవర్నర్కు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికే వదిలేశామని, బీజేపీ అభ్యర్దే కావాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఆ పార్టీ కూడమే అధికారం చేపడితే అభివృద్ధికి జరుగుతుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ పేర్కొంది.
భారతీయ జనతా పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ అధినేత్రి ముఫ్తీ సముఖంగా ఉన్నా, ఆ పార్టీ ఎమ్మేల్యేలు మాత్రం నిరాకరిస్తున్నారు. జనవరి 19 లోగా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడపోతే... రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.