విభజించే అధికారం, రెండు ఒక్కటే: కిరణ్కి జైరాం కౌంటర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆర్టికల్ 3, 4 ప్రకారం ఏ రాష్ట్రాన్ని అయినా విభజించే అధికారం కేంద్రానికి ఉందని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సోమవారం చెప్పారు. తెలంగాణ బిల్లు పైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంటున్న విషయం తెలిసిందే. బిల్లును తిప్పి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో తెలంగాణ సభ్యులు సభను అడ్డుకుంటున్నారు.
దీనిపై ఢిల్లీలో జైరామ్ మాట్లాడారు. తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తిప్పి పంపితే కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందని చెప్పారు. బిల్లులోని సవరణల పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీకి తాము పూర్తిస్థాయి బిల్లును పంపించామని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెడతామని, ఆమోదం పొందుతుందో లేదో చూడాలన్నారు.
ఆర్టికల్ మూడు, నాలుగు ప్రకారం ఏ రాష్ట్రాన్ని అయినా విభజించే అధికారం కేంద్రానికి ఉందని, కేంద్రం అధికారాలను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని చెప్పారు. బిల్లును తిప్పి పంపితే దాని విషయం న్యాయశాఖ చూసుకుంటుందన్నారు. బిల్లు తిరిగి వస్తే మంత్రుల బృందం (జివోఎం) భేటీ అవుతుందన్నారు.
తెలంగాణ బిల్లు పైన అసెంబ్లీ కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాల్సి ఉంటుందన్నారు. బిల్లుపై ఎన్నో సవరణలు వచ్చాయన్నారు. ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందనటం సరికాదన్నారు. ముసాయిదా బిల్లు, బిల్లు రెండు ఒకటేనని చెప్పారు. కాగా, ముసాయిదా బిల్లు అని పంపించారని, బిల్లును పంపించాల్సి ఉందని కిరణ్ రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే.