షాకింగ్: నోట్ల రద్దు తర్వాతే మరింత రెచ్చిపోయారు, జైట్లీ చెప్పింది అబద్దమా?
దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ వెలువరించిన వివరాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో అలర్లు తగ్గుముఖం పట్టాయని, తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు నిధుల కొరత ఏర్పడిందని ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ వెలువరించిన వార్తా కథనం కేంద్రమంత్రి వాదనకు భిన్నంగా ఉండటం గమనార్హం.
తీవ్రవాద కార్యకలాపాలపై నోట్లు రద్దు ఎఫెక్ట్ లేదని ఆ పోర్టల్ పేర్కొంది. అప్పటిలాగే ఇప్పుడు కూడా రాళ్ల దాడులు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీనికి బలం చేకూర్చేలా బుద్గాం జిల్లాలో రాళ్లు విసురుతున్న అల్లరి మూకలను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపింది.
అంతకుముందు జూన్ 26న ఈద్ సందర్భంగా బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో 12మంది గాయపడ్డారు. అదే రోజు అనంత్ నాగ్, సోపియన్, కుల్గాం, పుల్వామా జిల్లాలు సహా కశ్మీర్ వ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
మే 28నుంచి జూన్ 26మధ్య రంజాన్ సందర్భంగా చోటు చేసుకున్న అలర్లలో 43మంది మరణించారు. దీన్నిబట్టి నోట్ల రద్దు కన్నా ముందున్న పరిస్థితితో పోలిస్తే.. ఆ తర్వాత ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని స్పష్టమవుతోంది.