Amarnath Yatra: తాత్కాలికంగా నిలిచిపోయిన అమర్ నాథ యాత్ర.. ప్రతికూల వాతావరణమే కారణమా..
కరోనా కారణంగా రెండున్నరేళ్ల తర్వాత ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా నిలిచిపోయింది. హిమాలయ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్ నుంచి వెళ్తున్న దాదాపు 3వేల మందిని నున్వాన్ బేస్ క్యాంపు వద్దే ఆపివేశామని వెల్లడించారు.
ఇదే మార్గంలో వచ్చే మరో 4వేల మంది బ్యాచ్ను రంబాన్ జిల్లా చాందర్కోట్లో ఉన్న యాత్రి నివాస్లో ఉంచినట్లు పేర్కొన్నారు. జమ్మూ నుంచి బాల్తాల్ మార్గంలో ఉన్న దాదాపు 2వేల మందిని మాత్రం మంచులింగ దర్శనానికి అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
అమర్ నాథ్ శ్రీనగర్ నుంచి 141 కిమీ దూరంలో సముద్రమట్టానికి 3,888 మీ (12,756 అడుగులు) ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్లడానికి పహల్గామ్తోపాటు బాల్తాల్ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉన్నాయి. 2018లో 2.85 లక్షల మంది యాత్రికులు అమర్ నాథుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా యాత్ర చేపట్టలేదు. 2022 ఇప్పటికే చాలా మంది భక్తులు అమర్ నాథుడిని దర్శించుకున్నారు. ఇప్పటివరకు 72వేల మంది మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజాగా 6వేల మందితో కూడిన ఆరో బ్యాచ్ 239 వాహనాల కాన్వాయ్తో సీఆర్పీఎఫ్ భద్రత నడుమ బయలుదేరినట్లు అధికారులు పేర్కొన్నారు. పహల్గామ్ నుంచి గతవారం బయలుదేరిన బ్యాచ్లు ఇప్పటికే దర్శనం చేసుకున్నాయని.. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో హిమలింగ దర్శనానికి తాత్కాలికంగా భక్తులను అనమతించడం లేదన్నారు. ఈ ఏడాది జూన్ 30న ప్రారంభమైన ఈయాత్ర 43 రోజులపాటు కొనసాగనుంది.