జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. నేతలందరూ నిర్బంధంలో ఉండగానే!
జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఆగస్టులో 370 ఎత్తివేత తర్వాత జమ్మూకాశ్మీర్.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయంది. లడాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతమైతే, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. గత ఆరు నెలలుగా అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరూ నిర్బంధంలో ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడం గమనార్హం.
మార్చిలో ఎన్నికలు..
జమ్మూకాశ్మీర్ లో ఖాళీగా ఉన్న పంచాయితీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శైలేంద్ర కుమార్ గురువారం షెడ్యూల్ ప్రకటించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధులు లేని కారణంగా దాదాపు 60 శాతం స్థానాలు ఖాళీగానే మిగిలిపోయాయి. దీంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, మార్చి 5, 7, 9, 12, 14, 16, 18, 20 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని సీఈవో తెలిపారు.
నేతలందరూ నిర్బంధంలోనే..
గతేడాది ఆగస్టులో జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ఎత్తేసింది. దీనిపై రాజకీయ ఉద్యమాలు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా స్థానిక పార్టీల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేతలు ఫారూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు చిన్నాచితకా పార్టీల నేతలు, వేర్పాటువాద నాయకులు గత ఆరు నెలలుగా నిర్బంధంలోనే ఉన్నారు. వేర్పాటువాదుల్ని పక్కనపెడితే, కనీసం ప్రధాన రాజకీయ పార్టీల నేతలనైనా విడుదల చేయాలని పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు గొడవ చేసినా కేంద్రం పట్టించుకోలేదు.
ఈసారైనా ఓటేస్తారా?
కాశ్మీర్ లోయలో జనం మొదటి నుంచీ ఎన్నికల పట్ల విముఖత ప్రదర్శించడం, ఏ నాడూ పోలింగ్ శాతం 10కి మించకపోవడం తెలిసిందే. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో పరిస్థితులు మారిపోయాయని, జనజీవనం సాధారణంగా సాగుతోందని కేంద్రం చెబుతున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ముందుకొస్తారా? లేదా? అనేది వచ్చే నెల దాకా వేచిచూడాలి.