నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త చిచ్చు: ఆ అఖిలపక్ష భేటీ..అంతరార్థమేంటీ: ఎవరికి బెనిఫిట్
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా జాతీయ స్థాయి రాజకీయాల్లో చర్చల్లో ఉంటోన్న అంశం.. జమ్మూ కాశ్మీర్ నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశం. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత- ప్రధాని ఈ భేటీకి పూనుకోవడం వల్ల ఈ సమావేశంపై అందరి దృష్టీ నిలిచింది. కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీ ఫలితాలు ఎలా ఉండొచ్చనేది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమౌతోంది. బీజేపీకి డైహార్డ్ వ్యతిరేకులు ఉన్న నేతలు కూడా ఈ భేటీకి హాజరు కావడం మరో ఎత్తు.
మెజారిటీ అంశాలపై వ్యతిరేకతే..
పునర్విభజన అనంతరం జమ్మూ కాశ్మీర్, లఢక్గా విడిపోయింది. ఈ రెండూ కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయి. వాటి పరిపాలన వ్యవహారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం అక్కడ ప్రజా ప్రతినిధుల పాలనను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా- అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. దీనిపై జమ్మూ కాశ్మీర్కు చెందిన 14 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. తమ అభిప్రాయాలను వెల్లడించాయి. కేంద్ర ప్రతిపాదించిన మెజారిటీ విషయాలను వ్యతిరేకించినట్టే కనిపిస్తోన్నాయా పార్టీలు.
నియోజకవర్గాల పునర్విభజనపై పీటముడి..
ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి- నియోజకవర్గాల పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజనకు సహకరించాలంటూ ప్రధాని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దాదాపు అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా ప్రతి పాతికేళ్లకోసారి నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా.. జమ్మూ కాశ్మీర్కు మాత్రం ప్రత్యేకంగా నిర్వహించాలని తలపెట్టడాన్ని తాము నిరాకరించినట్లు ఒమర్ అబ్డుల్లా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ భారత్లో భాగమనే ఉద్దేశంతోనే 2009లో ఆ ప్రక్రియను ఇక్కడ కూడా చేపట్టారని గుర్తు చేశారు.
డీలిమిటేషన్ అవసరాన్ని వివరించిన కేంద్రం..
స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయిన తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమైందనేది కేంద్ర ప్రభుత్వం వాదన. ఇప్పుడున్న నియోజకర్గాలు జమ్మూ కాశ్మీర్, లఢక్లల్లో అటు, ఇటు అయ్యాయని, వాటికి ఓ సమగ్ర స్వరూపాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. దీనికి అనుగుణంగా ఓ డీలిమిటేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం-2019 ప్రకారం- అక్కడి స్థానాల సంఖ్య 90కి పెరుగుతాయి. అంతకుముందు అక్కడ 87 స్థానాలు ఉండేవి. అందులో 46 కాశ్మీర్, 37 జమ్మూ రీజియన్ కిందికి వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.
1995లో తొలిసారిగా..
1995లో తొలిసారిగా జమ్మూకాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చోటు చేసుకుంది. 1981 జనాభా ప్రాతిపదికన వాటిని పునర్విభజించింది కేంద్రం. 1991లో అక్కడ జనాభా లెక్కింపు జరగలేదు. 2001లో ఈ లెక్కింపు తరువాత అప్పటి అసెంబ్లీ- ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 2026 వరకూ ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదనేది దాని సారాంశం. దీన్నే అనుసరించాలనే వాదనను 14 రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్ష సమావేశంలో కుండబద్దలు కొట్టాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇక ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.