జమ్మూకశ్మీర్ లో మోడీ 2 రోజుల పర్యటన: కొనసాగుతున్న హైఅలర్ట్
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులపాటు జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రధాని పర్యటనకు ముందే ఉగ్రదాడి కలకలం రేగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేర్పాటువాదుల కదలికలపై నిఘా ఉంచారు.

అడుగడుగునా తనిఖీలు:
శ్రీనగర్, జమ్మూ మార్గాల్లో అడుగడుగునా భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. ఈ మార్గాన్ని సీర్పీఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని పర్యటించే మూడు రీజియన్లలో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలా ఉంటే, గురువారం శ్రీ నగర్లోని ఓ గార్డ్ పోస్టుపై దాడి చేసి ఉగ్రవాదులు ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటనపై అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘటనకు బాధ్యులిగా ఇద్దరు అధికారులపై వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించారు.
వేర్పాటువాదుల నిరసన ప్రదర్శనలు:
కశ్మీర్ కి మోడీ రాక సందర్భంగా వేర్పాటువాదులు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. జేఆర్ఎల్ ఆధ్వర్యంలో సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాజీ ఉమర్ ఫారూఖ్, యాసిన్ మాలిక్లు తమ గ్రూప్ సభ్యులతో మార్చ్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. శ్రీనగర్లోని లాల్ చౌక్ దాకా ర్యాలీ ఉంటుందని ప్రకటించిన జేఆర్ఎల్.. మే 21న బందుకు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications