Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులు
న్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించడానికి తొలి అడుగుగా భావించే జనతా కర్ఫ్యూనకు సోమవారం నాటితో ఏడాది పూర్తవుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది మార్చి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను అమలు చేసింది. ఆ తరువాతే లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. వివిధ దశల్లో మూడు నెలల పాటు ఇది కొనసాగింది. ఇప్పుడు కూడా దాదాపు అవే తరహా పరిస్థితులు దేశంలో నెలకొనడం యాదచ్ఛికమే. ఏడాది తిరిగే సరికి..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.
దీపాలు వెలిగించి..
కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోన్న సమయంలో, దాని బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు దేశం మొత్తం కదిలి వచ్చింది. మోడీ సూచనలకు అనుగుణంగా ప్రజలు జనతా కర్ఫ్యూ నాటి సాయంత్రం కొన్ని నిమిషాల పాటు లైట్లను ఆర్పివేసి, దీపాలు వెలిగించారు. గో కరోనా గో అంటూ నినదించారు.
అన్ని రాష్ట్రాలు సంఘీభావం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అన్ని రాష్ట్రాలు సంఘీభావం ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాలు స్తంభించిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకూ ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు బయట నిల్చుని చప్పట్లు, గంట మోగిస్తూ మద్దతు తెలిపారు. సుదీర్ఘ లాక్డౌన్కు అదే ఆదిగా నిలిచింది. జనతా కర్ఫ్యూను స్ఫూర్తిగా తీసుకుని లాక్డౌన్ను కఠినంగా అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం.
మళ్లీ అవే తరహా పరిస్థితులు..
సరిగ్గా ఏడాది తిరిగే సరికి దేశవ్యాప్తంగా మరోసారి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒక దశలో దేశవ్యాప్తంగా 10 వేల కంటే దిగువకు నమోదైన రోజువారీ పాజిటివ్ కేసులు..మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. 40 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్.. వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా- పలు నగరాలు పాక్షిక లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ అమల్లోకి తెచ్చాయి.
అప్పట్లో మూడు.. ఇప్పుడు
జనతా కర్ఫ్యూ నాటికి ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు మాత్రమే. జనతా కర్ఫ్యూ ఏడాదికి ఒక్కరోజు ముందు నమోదైన కేసులు 368. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. ఇందులో 8,84,357 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,189 మంది మరణించారు. యాక్టివ్ కేసులు రెండు వేల మార్క్ను దాటాయి. 2,188కి చేరుకున్నాయి. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య మూడువేలకు చేరువ అవుతోంది. అత్యధికంగా గుంటూరు-79, కర్నూలు-49, చిత్తూరు, అనంతపురంలలో 40 కేసులు చొప్పున నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications