ప్రధాని మన్ కీ బాత్: తెలుగువారిపై ప్రశంసలు: విజయవాడ ప్రొఫెసర్ సహా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్.. మరో మైలురాయిని అందుకుంది. 75వ ఎపిసోడ్ను పూర్తి చేసుకుంది. 75వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ మహమ్మారిపై ఏడాదికాలంగా కొనసాగుతోన్న పోరాటాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. 75 నెలలుగా నిరాటంకంగా సాగుతూ వస్తోన్న ఈ రేడియో కార్యక్రమంలో చోటు చేసుకున్నకొన్ని ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోన్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు.
హైదరాబాద్కు చెందిన జయ్ చౌదరీ అనే వందేళ్ల కురువృద్ధుడు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారని అన్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని చెప్పారు. మహిళా క్రికెట్లో 10 వేల మైలురాయిని అందుకున్న మిథాలి రాజ్, పీవీ సింధులను మోడీ తన ప్రసంగం పట్ల ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు వారిద్దరూ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు సాధించిన ఘన విజయాల గురించి మాట్లాడారు. ఆమె అనేక అవార్డులను అందుకున్నారని చెప్పారు. దేశ క్రీడారంగంలో మహిళలు అద్భుత పురోగతిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు.
తాజాగా పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో సిల్వర్ మెడల్ అందుకున్న విషయం తెలిసిందే. విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పడకండ్ల గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. శ్రీనివాస్..ఆటోమొబైల్ వ్యర్థాల నుంచి అద్భుతాలను సృష్టించారని చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి సేకరించిన ఇనుప ముక్కలు, ఇతరర వస్తువులతో విగ్రహాలను రూపొందించారని ప్రశంసించారు. అలాంటి విగ్రహాలను అధికారులు పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పారని, వేలాదిమందిని అవి ఆకర్షిస్తున్నాయని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వ్యర్థాలను ఇలా రీసైక్లింగ్ చేయడం గొప్ప విషయమని మోడీ అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి తమిళనాడుకు చెందిన బస్ కండక్టర్ మారిముత్త యోగనాథన్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ప్రయాణికుడికి ఆయన టికెట్తో పాటు మొక్కలను అందిస్తుంటారని వివరించారు. అలాంటి చర్యలు తోటి వారిలో స్ఫూర్తి నింపుతాయని అన్నారు. తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీ, హైదరాబాద్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలను మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయా రంగాల్లో వారు చేస్తోన్న కృషిని మెచ్చుకున్నారు.