సొంత ఇమేజ్తో... పన్నీరుసెల్వం ప్లాన్, జయలలితపై పళని వర్గం..
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పన్నీర్ సెల్వం రాజీకి వస్తానంటున్నారా, తన సత్తా చాటేందుకు ఆయన వెనుకాడటం లేదా, నెల రోజుల పర్యటన వెనుక ఉద్దేశ్యం అదేనా.. అంటే అవుననే అంటున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పన్నీర్ సెల్వం రాజీకి వస్తానంటున్నారా, తన సత్తా చాటేందుకు ఆయన వెనుకాడటం లేదా, నెల రోజుల పర్యటన వెనుక ఉద్దేశ్యం అదేనా.. అంటే అవుననే అంటున్నారు.
రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే వైరి వర్గాలు విలీనం కావాలనుకున్నాయి. చర్చల కోసం సీఎం పళనిస్వామి ఒక కమిటి వేస్తే, పన్నీర్ కూడా తన వంతుగా మరో కమిటి వేశాడు. ఈ కమిటీ వేసి వారాలు గడిచినా.. ఒక్క సమావేశం కూడా జరగలేదు.
విలీనం రెండు వర్గాలకు ఇష్టం లేదన్న తరుణంలో పన్నీర్ కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర పర్యటన ప్రారంభించిన ఆయన అసలు తన సత్తా ఏమిటో చాటే ప్రయత్నం చేస్తున్నారు.
చర్చల ప్రతిష్టంభనకు
చర్చల ప్రతిష్టంభనకు అనేక కారణాలు ఉన్నాయి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే దివంగత జయలలిత మద్దతు ఉందని, అందుకే ఈసారి కూడా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పన్నీర్ సెల్వం కోరుతున్నారు. శశికళ, దినకరన్లను పార్టీకి దూరంగా ఉంచుతామని పళనిస్వామి వర్గం నుంచి పన్నీర్ లిఖితపూర్వక హామీని డిమాండ్ చేస్తున్నారు.
అధికారిక లేఖపై నో
పార్టీ కార్యాలయంలో శశికళ ఫోటోను తొలగించినప్పటికీ అధికారికంగా ఒక లేఖ విడుదల చేసేందుకు పళనిస్వామి వర్గం సుముఖంగా లేదు. పన్నీర్ సెల్వానికి సీఎం పదవి వదిలేసేందుకు కూడా పళని ఇష్టపడటం లేదు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
సీబీఐ విచారణకు..
జయలలిత మృతిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయాలన్న పన్నీర్ డిమాండ్కు పళనిస్వామి తలొగ్గే అవకాశాలు కూడా కనిపించడం లేదు. పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు లేని పన్నీర్కు సీఎం పదవి ఎలా ఇస్తామని పళని వర్గం ప్రశ్నిస్తోంది.
బలం ఉందని..
ప్రజాక్షేత్రంలో తనకే బలముందని పన్నీరుసెల్వం అంటున్నారు. ఆ అంశాన్ని నిరూపించేందుకు నెలరోజుల యాత్ర ప్రారంభించారు. కాంచీపురంలో యాత్ర ప్రారంభమైన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనం పెద్దసంఖ్యలో హాజరై పన్నీర్ ప్రసంగానికి కేరింతలు కొట్టారు. దీంతో ఇప్పుడు పన్నీర్ టూర్పై అందరి దృష్టి పడింది.
జయ అభిమానం, శశికళ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని..
ప్రజల్లో జయలలిత పట్ల ఉన్న అభిమానం, అదే ప్రజల్లో శశికళ పట్ల ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని పన్నీరుసెల్వం నిర్ణయించుకున్నారు. అందుకే ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రజాబలం ద్వారా రాజకీయ మార్పుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జయలలిత పంచన ఎదిగిన నేతగా కాకుండా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
సొంత ఇమేజ్..
గతంలో జయలలిత తనను పొగిడిన సందర్భాలను గుర్తుచేస్తూనే సొంత ఇమేజ్తో ఎదిగిన నేతగా చెప్పుకునేందుకు పన్నీరుసెల్వం ఆసక్తి చూపిస్తున్నారు. చర్చల ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయిన నేపథ్యంలో పన్నీరు తన దూకుడును కొనసాగించాలని తీర్మానించుకున్నారు.
తమిళనాడు దేవత
జయలలిత ఇమేజ్ను సొంతం చేసుకోవాలని రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన పన్నీరుసెల్వంకు పళనిస్వామి వర్గం కౌంటర్ ఇస్తోంది. ఈ మేరకు మధురైలో యూత్ ఫెస్టివెల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. అమ్మ తమిళనాడు కుటుంబాలకు దేవత అని అందులో పేర్కొన్నారు.