అపోలో డాక్టర్లపై జయలలిత ఫైర్-విదేశాలకు అవసరమా అన్న శశికళ-ఆడియో, వీడియోలు లీక్..
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుమానాస్పద స్ధితిలో మృతిచెందిన వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుండగా.. ఆర్ముగం కమిషన్ రిపోర్ట్ తో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా అపోలో ఆస్పత్రిలో జయలలితకు సరైన చికిత్స అందలేదనే విషయాన్ని అవి నిర్ధారించేలా ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న సమయంలో మాట్లాడినట్లుగా చెప్తున్న కొన్ని మాటలు లీక్ కావడం సంచలనం రేపుతోంది.
అపోలో డాక్టర్లపై జయలలిత అసహనం
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత తన గదిలో ఉన్న డాక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఈ ఆడియోలో ఉంది. తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దగ్గుతూ ఉన్నారు కూడా. బాధపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ డాక్టర్లపై జయలలిత అసహనం వ్యక్తంచేస్తున్నట్లు ఆమె వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఆడియోను అక్కడే ఉన్న సిబ్బంది రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
విదేశాలకు అవసరమా అన్న శశికళ?
అలాగే 2017లో జయలలిత చికిత్సకు సంబంధించి వివరాలు అందించేందుకు లండన్ డాక్టర్ రిచర్డ్ బేలే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న జయ నెచ్చెలి శశికళతో మాట్లాడుతున్నారు. ఆ వీడియో కూడా ఇలాగే ఎవరో రికార్డు చేశారు. ఈ వీడియోలో బేలే చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. జయలలిత అప్పటి పరిస్దితిపై బేలే వివరిస్తుంటే, మధ్యలో జోక్యం చేసుకున్న శశికళ జయలలితను విదేశాలకు పంపడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా ఆమె చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సిందేనని, ఆమె అందుకు అంగీకరించారని కూడా బేలే చెప్తున్నారు. దీంతో ఈ వీడియో కూడా కలకలం రేపుతోంది.
ఆర్ముగస్వామి రిపోర్ట్ తో లీకులు
జయలలిత మృతి మిస్టరీ ఛేదించేందుకు తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదికలో భాగంగానే ఈ ఆడియో, వీడియోలు ప్రభుత్వానికి కమిషన్ సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే వీటిని కొందరు లీక్ చేయడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తమిళనాడులో ప్రజల ఆరాధ్యదైవంగా ఉన్న జయలలిత చివరి రోజుల్లో ఎంత వ్యధ అనుభవించారో, ఆస్పత్రిలో ఆమెకు ఎలాంటి చికిత్స అందిందన్న దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.