తీవ్ర చర్యలు వద్దు, దైవకృఫతో బయటకు వస్తా: జయ
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తీవ్ర చర్యలకు పాల్పడవద్దని అన్నాడియంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన మద్దతుదారులను కోరారు. అన్ని కష్టాల నుంచి తాను దైవ సహాయంతో బయట పడతానని ఆమె శనివారంనాడు అన్నారు.
జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనై వివిధ కారణాలతో 193 మంది మరణించారు. వారిలో ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. జైలు నుంచి బెయిల్పై విడుదలై బయటకు వచ్చిన తర్వాత కూడా అక్టోబర్ 19వ తేదీ నుంచి మరో 26 మంది మరణించారు. మరణాల పట్ల జయలలిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
అన్ని సవాళ్లను అధిగమించి తాను బయటపడతాననే నమ్మకం తనకు ఉందని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. అందువల్ల తీవ్రమైన చర్యలకు పూనుకోవద్దని తాను తమిళనాడు ప్రజలను కోరుతున్నానని ఆమె అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున 3 లక్షల రూపాయలేసి ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు
అన్నాడియంకె 26 ంది వ్యక్తుల జాబితాను పార్టీ కార్యాలయంలో విడుదల చేసింది. 66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో జయలలితకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27వ తేదీన నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆమెకు సుప్రీంకోర్టు అక్టోబర్ 17వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. ఆ మర్నాడు ఆమె చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు.