బెయిల్ వచ్చినా రాత్రంతా జైల్లోనే జయలలతి
బెంగళూర్: సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె చీఫ్ జయలలిత రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. బెంగళూర్లోని జైలు నుంచి ఆమె శనివారం విడుదలయ్యే అవకాశం ఉంది. జయలలితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రత్యేక కోర్టుకు శుక్రవారం చేరలేదు.
దాంతో ప్రత్యేక కోర్టు జయలలిత విడుదలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేయలేదని కర్ణాటక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) పిఎం జయసింహ చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆమెకు డిసెంబర్ 18వ తేదీ వరకు తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేసింది.
పూచీకత్తును సమర్పించిన తర్వాత ప్రత్యేక కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే జయలలితను విడుదల చేస్తామని జయసింహ చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ ఇచ్చిన విషయం జయలలితకు తెలిసింది. అయితే, అధికారికంగా ఆ విషయాన్ని ఆమెకు చేరవేయలేదు. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత జయలలితకు ఆ విషయం తెలిజేస్తామని జయసింహ అన్నారు. శనివారం సాయంత్రం ఆమె విడుదలకు అవకాశాలున్నట్లు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల కారాగా శిక్ష విధిస్తూ, వంద కోట్ల జరిమానా వేస్తూ సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. జయలలిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీన తిరస్కరించింది. దాంతో ఆమె అక్టోబర్ 9వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లారు.