జయలలిత మృతి, మంత్రులకు లై డిటెక్టర్ పరీక్షలు: అప్పుడే వాస్తవాలు బయటకు. స్టాలిన్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ కమిషన్ అధికారులు కొందరిని లై డిటెక్టర్ పరీక్షలు చేసి విచారణ చెయ్యాలని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయని ఆ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
జయలలిత మరణంపై ఏఐఏడీఎంకే పార్టీలోని నాయకులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఎంకే. స్టాలిన్ ఆరోపించారు. జయలలిత మరణంపై మాతో పాటు తమిళనాడు ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని స్టాలిన్ అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలిత మరణంపై ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడంతో దేశ వ్యాప్తంగా తమిళనాడుకు చాల చెడ్డపేరు వచ్చిందని స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వీరమణితో సహ అన్నాడీఎంకే పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జయలలిత మరణంపై తమిళనాడు మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, సెల్లూరు రాజు బహిరంగంగా మీడియా ముందు పొంతన లేని మాటలు మాట్లాడారని, వారికి లైడిక్టెర్ పరీక్షలు నిర్వహించాలని, అప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తాయని డిమాండ్ చేశారు.