అమ్మ అభిమానుల శిరోముండనం: ఆత్మశాంతి కోసం దీక్షలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న అమ్మ అభిమానులు ఆమె సమాధి వద్ద శిరోముండనం ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.
చెన్నై: అమ్మ చనిపోయారన్న షాక్ నుంచి ఆమె అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. అమ్మ చనిపోయి రెండు రోజులు కావస్తున్నా.. నేటికి తమిళనాడులో విషాద ఛాయలు ఇంకా తొలగిపోలేదు. అమ్మ అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్ కు ఆమె అభిమానులు పోటెత్తుతున్నారు.
అభిమానుల తాకిడితో బుధవారం నాడు కూడా మెరీనా బీచ్ కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న అమ్మ అభిమానులు ఆమె సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. మరికొంతమంది అభిమానులు శిరోముండనం చేయించుకుంటుండటం గమనార్హం. మెరీనా బీచ్ ప్రాంతంలో చాలామంది అమ్మ అభిమానులు గుండు గీయించుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి. తద్వారా వారు అమ్మకు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
కాగా, అమ్మ ఆత్మశాంతి కోసం ఆమె అభిమానులు దీక్షను చేపట్టడం గమనార్హం. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ నెలరోజుల పాటు ఈ దీక్షలను కొనసాగించనున్నట్టు అభిమానులు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత ఆలయాల్లో ప్రత్యేక పూజల ద్వారా దీక్షలను విరమిస్తామని పేర్కొన్నారు.