జయలలిత హెల్త్ అప్ డేట్ ఇదే !
చెన్నై: ఏఐఏడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగ్గా ఉందని అన్నాడీఎంకే కీలక నేతలు ప్రకటించారు. అమ్మ ఆరోగ్యం సాధారణ పరిస్థితికి వచ్చిందని వారు స్పష్టం చేశారు.
గతంలోలాగానే జయలలిత ప్రజల ముందుకు వస్తారని అన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్. రామచంద్రన్ మాట్లాడుతూ అమ్మ జయలలిత ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అన్నారు.
జయలలిత పూర్తిగా కోలుకుంటున్నారని, ఆమె త్వరలో ముందులాగా రాష్ట్ర పరిపాలన సాగిస్తారని రామచంద్రన్ వివరించారు. జయలలిత ఆరోగ్యం మెరుగ్గా ఉందని అపోలో వైద్యులు చెప్పారని జయ సన్నిహితురాలు, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్. సరస్వతి మీడియాకు చెప్పారు.

జయలలిత పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని, తరువాత ఆమె ఇంటికి చేరుకుంటారని సీఆర్. సరస్వతి అన్నారు. అయితే గతంలో దీపావళి పండుగకు ముందే (అక్టోబర్ 27వ తేదీ) జయలలిత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఇదే నాయకులు చెప్పారు.
అక్టోబర్ 21వ తేదిన అపోలో ఆసుపత్రి వైద్యులు చివరిసారి జయలలిత ఆర్యోగం విషయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తరువాత ఇప్పటి వరకు జయలలిత ఆరోగ్యం విషయంలో హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు.
రెండు వారాలకు పైగా హెల్త్ బులెటిన్ విడుదల కాకపోవడంతో అమ్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో అన్నాడీఎంకే నాయకులు తమ పార్టీ కార్యకర్తలకు అమ్మ ఆరోగ్యం గురించి వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications