ప్రమాదమని హెచ్చరించినా.. జయ ఆ విషయంలో వెనక్కి తగ్గలేదట!
జయకు భద్రతాధికారిగా ఉన్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఐపీఎస్ విజయ్ కుమార్ వెల్లడించారు.
చెన్నై: ప్రజా ప్రతినిధులన్నాక జనంలోకి చొచ్చుకెళ్లడం పరిపాటి. సమస్యలు తెలుసుకోవడంలోను, వాటి పరిష్కారంలోను తమదైన ముద్ర వేయగలిగాలి. ఈ క్రమంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా.. వెనుకడుగేసే పరిస్థితి ఉండకూడదు. తమిళ దివంగత సీఎం జయలలిత వైఖరి కూడా ఇలాగే ఉండేదని ఐపీఎస్ విజయ్ కుమార్ చెబుతున్నారు.
గంధపు చెక్కల స్మగ్లర్ గా మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ ను మట్టుపెట్టడంలో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం నేపథ్యంలో.. ఆమె మరణానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆయన జయతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
జయకు భద్రతాధికారిగా ఉన్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా వెల్లడించారు. జయకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా.. పర్యటనలను కొంతవరకు తగ్గించుకోవాలని అప్పట్లో జయకు విజయ్ సూచించారట. ఆ మాట వినగానే జయలలిత నవ్వేశారట. 'నన్ను కాపాడటం మీ బాధ్యత, ప్రజల వద్దకెళ్లి సమస్యలు తెలుసుకోవడం నా బాధ్యత' అంటూ సున్నితంగా తన శైలి ఎలాంటిదో వ్యక్తపరిచారట.
ప్రజలకు దూరంగా ఉండటమంటే కష్టమని, అయితే భద్రతా పరంగా మీకు సహకరిస్తానని విజయ్ తో చెప్పుకొచ్చారట జయలలిత. ఈ విషయాన్ని ఐపీఎస్ విజయ్ స్వయంగా వెల్లడించారు. కొన్ని సందర్బాల్లో ప్రమాద హెచ్చరికలను సైతం ఆమె అంతగా లెక్క చేయలేదన్న విషయం దీంతో స్పష్టమవుతోంది.