9 నెలల తర్వాత 22న బయటకు జయలలిత, 23న ప్రమాణం!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని తెలుస్తోంది. ఆమె 22న దర్శనం ఇవ్వనున్నారు. దాదాపు తొమ్మిది నెలలపాటు ఇంటికే పరిమితమైన జయలలిత ఈ నెల 22న పోయెస్ గార్డెన్ గడపదాటి ప్రజల మధ్యకు రానున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం దోషిగా పేర్కొనడంతో జైలుకెళ్లిన ఆమె, ఆ తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో కర్ణాటక జైలు నుంచి విడుదలై పోయెస్ గార్డెన్లోని తన ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలకు కూడా కనిపించలేదు.

కర్ణాటక హైకోర్టు ఈ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అప్పటికీ ఆమె ఇంటి వెలుపలికి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 22న ప్రజల మధ్యకు రానున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం పార్టీ కార్యాలయంలో జరగనుంది.
ఆమెను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం జయ అక్కడికి చేరుకోనున్నారు. శాసనసభ్యులు, కార్యకర్తలను కలిశాక మధ్యాహ్నం రెండు గంటలకు మౌంట్ రోడ్డులోని ఎంజీఆర్ విగ్రహానికి అనంతరం అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications