జయలలిత ఆరోగ్యంపై మోడీ ఆరా?: భారీ భద్రత, కళ్లు తెరిచిన 'అమ్మ'
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు వాకపు చేశారని ప్రచారం జరిగింది. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర రావు ప్రధానికి లేఖ రాశారని సమాచారం.
దీంతో, ప్రధాని మోడీ అపోలో ఆసుపత్రి వర్గాలతోనూ, ప్రభుత్వ వర్గాలతోనూ మాట్లాడి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటారని ప్రచారమైంది. మరోవైపు జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

చెన్నైకి చేరుకున్న శాసనసభ్యులు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరు సోమవారం నాడు సాయంత్రానికి చెన్నైకి చేరుకున్నారు. వారిని చెన్నైకి వచ్చి అందుబాటులో ఉండాల్సిందిగా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందిందని తెలుస్తోంది. ఆసుపత్రి వద్ద జయ కోసం అభిమానులు నిరీక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద గుమికూడిన విషయం తెలిసిందే. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్కె నగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడి మురుగన్ కోయిల్కు 5004 పాలబిందెలతో అభిషేకం చేసి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.

జయలలిత క్షేమంగా ఉన్నారు
జయలలిత క్షేమంగా ఉన్నారని, సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆమె గతంలో వలె బాగా పాలిస్తారని అన్నాడీఎంకే ప్రతినిధి సరస్వతి అన్నారు. సినీనటుడు శరత్ కుమార్ జయను చూసి వెళ్లారు.

అపోలో వద్ద భారీ భద్రత
జయకు చికిత్స నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద భారీ భద్రతా ఉంది. 500 నుంచి వెయ్యి మంది పోలీసులు ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మాత్రం ఇబ్బంది లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రి రెండో అంతస్తులో జయకు చికిత్స అందిస్తున్నారు. ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆమెకు వైద్య సేవలందిస్తున్న వైద్య బృందానికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చింది. కొందరు పార్టీ సీనియర్లకు ప్రత్యేక పాసులు ఇచ్చారు.
4

కళ్లు తెరిచి చూసిన జయ
కాగా, జయలలిత సోమవారం ఉదయం కాస్త కళ్లు తెరచి చూసినట్లు, ఆ సందర్భంగా ఆమెకు కాసేపు వెంటిలేటర్ తొలగించినట్లుగా తెలుస్తోంది. మునుపటికి కంటే ఆమె పరిస్థితి కాస్త మెరుగైనట్లు ప్రచారం జరుగుతోంది. లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రాబర్ట్ బాలే, అపోలో సంస్థల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, అపోలో ప్రత్యేక వైద్యుల బృందం జయను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

వైద్యానికి స్పందన
వైద్యానికి జయ బాగా స్పందిస్తుండటంతో ఈ బృందంలోని డాక్టర్ రాబర్ట్ బాలే ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి జయ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఇక్కడి వైద్యులకు తగు సలహాలు, సూచనలు అందజేస్తారు. అత్యవసరమనిపిస్తే ఆయన తిరిగి వస్తారని చెబుతున్నారు. జయలలిత మరో వారం, పది రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవలసి ఉంటుందంటున్నారు. యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications