అమ్మకే ఓటు, తాత్కాలికం వద్దు: అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్ధానంలో తాత్కాలిక డిప్యూటీ సీఎంను నియమించాలన్న ఆలోచనపై అన్నాడీఎంకే ఒక నిర్ణయానికి వచ్చింది.
రాష్ట్రంలో పరిపాలనాపరమైన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నందున డిప్యూటీ సీఎం అనవసరం లేదని ఏకగ్రీవ తీర్మానం చేసి తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుకు అన్నాడీఎంకే పంపించింది.
ఇదిలా ఉంటే అనారోగ్యం కారణంగా గత ఇరవై రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న జయలలిత మెల్లగా కోలుకుంటున్నారు. డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యబృందం, లండన్ వైద్యుడు డాక్టర్ జాన రిచర్డ్ బీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జయలలిత వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వ్రతాలు చేస్తున్నారు. పాల బిందెలతో వేలాది మంది గుళ్లకు వెళ్లి ఊరేగింపుగా పూజలు నిర్వహిస్తున్నారు.
కాగా, జయలలిత చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద మహిళలు చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు. జయకు న్యూట్రీషన్స్తో కూడిన ద్రవపదార్థాలు అందిస్తున్నారు.