కార్యదర్శిక్ షాక్: పదేళ్ల అనర్హతపై జయలలిత ఆగ్రహం?
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు అంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెలువడిన అధికారిక ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రకటన జారీ చేసిన శాసన సభ కార్యదర్శి ఏఎంపీ జమాలుద్దీన్ను సాగనంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో నాలుగు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ సభ్యురాలైన జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన 2014, సెప్టెంబర్ 27వ తేదీ నుండి అనర్హత వర్తిస్తుందని తెలిపింది.
జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీరంగపురం అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. శ్రీరంగపురం స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తెలిపింది. ఈ స్థానం ఖాళీ అయినట్లుగా ఇంతకుముందే వెల్లడించినా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా వెల్లడించింది.

కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక ప్రత్యేక న్యాయస్థానం జయలలితను దోషిగా పేర్కొనడంతో ఆమె జైలు పాలయ్యారు. ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. న్యాయస్థానం దోషిగా పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల పోటీలో అనర్హురాలయ్యారు.
జయ ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీరంగపురం ఖాళీ అయింది. దానిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఇందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన శాసన సభ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ జమాలుద్దీన్.. జయ అనర్హతను ధ్రువీకరిస్తూ అధికారిక ప్రకటన జారీ చేయడం, రాజపత్రం ఉత్తర్వులు వెలువడటం జరిగాయి.
ఇది ప్రభుత్వంలో కలకలం సృష్టించింది. అన్నాడీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జయలలితకు విధేయుడైన ముఖ్యమంత్రికి ఇది మరింత ఇరకాటంగా మారిందని అంటున్నారు. జయలలిత కూడా ఈ పరిణామాలతో ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే అధికారిని సాగనంపే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications