జయ నెచ్చెలి శశికళ: ఎలా దగ్గరయ్యారు, ఒకరికోసం ఒక్కరు
జయలలిత, శశికళలది విచిత్రమైన బంధం. ఒకరికోసం ఒకరు అన్నట్లుగా మెలుగుతూ వచ్చారు. వారిద్దరికి ఎలా పరిచయమైంది, ఎలా సన్నిహితులయ్యారనేది ఎక్కువ మందికి తెలియదు
చెన్నై: జయలలిత అత్యంత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్. వారిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది, ఎలా ఇద్దరు దగ్గరయ్యారనేది ఆసక్తికమైన విషయమే. నిజానికి, శశికళ ఓ సాధారణ గృహిణి. అయితే ఆమెకు సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో నటించాలని కలలు కనేవారు.
ఆమె భర్త ఆర్.నటరాజన్ తాత్కాలిక ప్రాతిపదికన తమిళనాడు ప్రభుత్వంలో ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా పనిచేసేవారు. అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్కి సన్నిహితులైన కడలూరు జిల్లా కలెక్టర్ వీఎస్ చంద్రశేఖర్కు నటరాజన్ మిత్రుడు.
ఆ సమయంలో జయలలిత అన్నాడీఎంకే పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. సినిమా మోజుతో శశికళ వీడియో షాపు నడిపేవారు. పెళ్లిళ్లు, వేడుకలకు వీడియోలు తీస్తుండేవారు. జయపై ఒక వీడియో తీసేందుకు ఒప్పించాలని శశికళ తన భర్తను కోరారు.
ఇద్దరు ఇలా కలుసుకున్నారు..
నటరాజన్ తన మిత్రుడు చంద్రశేఖర్కు విషయం చెప్పి శశికళను జయకు పరిచయం చేయించారు. ఆ విధంగా 1989లో తొలిసారి జయ, శశికళ కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటూ వచ్చారు. తొలి రోజుల్లో జయ, శశికళ ఒకే విధమైన దుస్తులు, నగలు ధరిస్తుండేవారు.
జయ నివాసంలో మన్నార్గుడి మాఫియా.
పోయ్సగార్డెనలోని జయ ఇంట్లో పనిచేసే పని మనుషులను కుదిర్చింది శశికళే. తన సొంత గ్రామమైన మన్నార్గుడి నుంచి వారిని తెప్పించి, పనిలో పెట్టించింది. దానివల్ల జయలలిత ఇంట్లోని పనిమనుషులు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది అందరూ శశికళ చెప్పుచేతల్లోనే ఉండేవారని అంటారు. తమిళ రాజకీయ వర్గాలు వీరిని ‘మన్నార్గుడి మాఫియా' అని పిలిచేవారు.
దత్త పుత్రుడి పెళ్లితోనే కష్టాలు...
జయలలిత 1991లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో తన దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి వేడుకను దిమ్మదిరిదే రీతిలో జయ గిన్నిస్ రికార్డు సృష్టించారు. చెన్నైలో 50 ఎకరాల మైదానంలో 1,50,000 మంది అతిథులకు విందు ఏర్పాటు చేశారు. అతిపెద్ద వివాహ విందుగా అది రికార్డులకెక్కింది.
దాంతోనే ఐటి శాఖ దృష్టి
వివాహ ఆహ్వాన పత్రికకు బంగారపు పూత పూయించారు. వివాహానికి వచ్చిన వారికి వెండి ప్లేట్లు బహూకరించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ పెళ్లి తరువాతే జయలలిత అక్రమ ఆస్తుల కేసుల పర్వం ప్రారంభమైంది. ఐటీ శాఖ అప్పట్లో పెళ్లి ఖర్చులు రూ.10 కోట్లుగా అంచనా వేసింది.
శశిని ఇలా గెంటేశారు..
శశికళ ద్వారా తన ఇంట్లో చేరిన మన్నార్ గుడి మాఫియా తనకు తెలియకుండా తనను మోసం చేసే పనికి పూనుకున్నారని జయలలిత ఆగ్రహం చెందారు. అదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు విశేషంగా కొద్దికాలంలో పెద్ద యెత్తను సంపాదించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో 2012లో శశికళను, ఆమె బంధు మిత్రులను తన నివాసమైన పోయెస్ గార్డెన్ నుంచి జయ గెంటేశారు. పార్టీ నుంచి కూడా బహిష్కరించారు.
శశికళకు మళ్లీ ఆహ్వానం..
అయితే మూడు నెలల తర్వాత కరుణించిన జయ, తిరిగి శశికళను తన నివాసానికి రప్పించుకున్నారు. ఆ సమయంలో జయే స్వయంగా హారతినిచ్చి శశికళను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోయెస్ గార్డెన వర్గాలు చెబుతాయి.