జయ కేసు: బీజేపీలో స్వామి ఒంటరి, పదవిపై వెనక్కి తగ్గిన 'అమ్మ'
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామిని ఒంటరి చేసిందా? అంటే అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు.
జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో మొదటి నుండి సుబ్రహ్మణ్య స్వామి పోరాడం చేస్తున్నారు. ఆమెను కోర్టుకు ఈడ్చారు. హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత మాట్లాడుతూ... తాను జయలలిత కేసులో సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు.
అదే సమయంలో, బీజేపీ పెద్దలు మాత్రం జయలలితకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు బీజేపీ చీఫ్లు జయకు అభినందనలు తెలిపారు. ఆమె నిర్దోషిగా విడుదలైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ ముఖ్యులు జయ విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తుండగా, అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పోరాటం చేస్తుండటం గమనార్హం.
జయలలిత ప్రమాణ స్వీకారం ఆలస్యం?
జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కర్నాటక ప్రభుత్వం అప్పీల్కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆమె ఆచితూచి స్పందిస్తున్నారు. శుక్రవారం శాసనసభ పక్షం నిర్వహించాలని అనుకున్నా, తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
ముందు అనుకున్నట్లు ఈనెల 17న సీఎంగా జయ ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపై అపీల్కు వెళ్లాలంటూ డీఎంకే సహా తమిళ పార్టీలు డిమాండ్ చేస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. సుప్రీం కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏమిటన్న కోణంలో జయ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
జయ అక్రమాస్తుల లెక్కింపులో కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి సరిగా వ్యవహరించలేదని, తన వాదనలకు అవకాశం కల్పించలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆచార్య ఆరోపించారు. దీంతో ఆమె ఆస్తులను కర్నాటక హైకోర్టు తిరిగి లెక్కిస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేస్తామని జయకు మాత్రమే చెప్పారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మంచి రోజు కోసం జయలలిత వేచి చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఆమె సీఎంగా బాధ్యతలు చేపడతారని అన్నాడిఎంకే వర్గాలు అంటున్నాయి. అన్నాడిఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నైలో అందుబాటులో ఉన్నారు. తీర్పు వివరాలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.