అంతా శశికళ వల్లే, జయలలితకు భయంకర అనుభవం.. నా కోసం అప్సెట్: స్వామి
బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి దివంగత జయలలిత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించి కథనం వచ్చింది.
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి దివంగత జయలలిత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల మీడియాలో కథనం వచ్చింది.
తాను 1982లో తొలిసారి జయలలితను కలిశానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఆ సమయంలో దివంగత ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. అప్పుడే జయ రాజకీయాల్లో కొత్తగా చేరారని తెలిపారు. 34 ఏళ్లుగా జయ - తనకు పరిచయం ఉందని తెలిపారు.
తెలివిగల వ్యక్తి కానీ సినిమాలే..
జయలలిత చాలా తెలివైన వ్యక్తి అన్నారు. ఆమెకు మంచి నాలెడ్జ్ ఉందన్నారు. అలాగే చాలా ధైర్యవంతురాలు అని చెప్పారు. అయితే బాధాకరమైన విషయం ఏమంటే సినిమా రంగం ఆమెకు బాధను మిగిల్చింద్ననారు. సినిమా రంగంలో ఎలాంటి సంతోషం లేకపోవడం వల్ల ఆమె జీవితం సంతోషంగా గడవలేదన్నారు. ఆ తర్వాత జీవితం కూడా అలాగే గడిచిందని చెప్పారు.
నా పట్ల గౌరవం కానీ శశికళ వల్లే... కంట్రోల్లో ఉంచుకున్నది
తన పట్ల జయలలితకు గౌరవం ఉందని తెలిపారు. తన నాలెడ్జ్, సామర్థ్యాన్ని ఆమె గౌరవించే వారని చెప్పారు. అయితే ఆమె పైన శశికళ ప్రభావం బాగా పడిందని చెప్పారు. జయలలితను శశికళ మొత్తం తన కంట్రోల్లో ఉంచుకున్నారని చెప్పారు.
అయినప్పటికీ రాజకీయంగా తామిద్దరం ఒకచోటకు వచ్చినప్పుడు శశికళ జోక్యం చేసుకొని అడ్డుపుల్ల వేసేవారని అభిప్రాయపడ్డారు. శశికళ ప్రభావం జయలలిత పైన బాగా పడిందని, దీంతో ఆమె (జయలలిత) వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా లేకుండా పోయిందన్నారు.
ఇరువురం రాజ్యసభలో..
1980లో ద్వితీయార్థంలో జయ, తాను ఇద్దరం కూడా పార్లమెంటు సభ్యులం అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఇరువురం రాజ్యసభ సభ్యులం అన్నారు. జయ ఒకటి రెండు సార్లు సభలో బాగా మాట్లాడారన్నారు. కానీ ఆమె రాజ్యసభ టర్మ్ ఎక్కువ లేదన్నారు.
పార్టీ కోసం జయ నా సాయం కోరారు
1996లలో అన్నాడీఎంకే ప్రాభవం కోల్పోయిందని, 1997లో జయలలిత తన ఇంటికి వచ్చారని, తన సహాయం కోరారని చెప్పారు. పార్టీని తిరిగి పునరుద్దరించేందుకు నా సాయం అడిగారని చెప్పారు. పార్టీని పునరుద్ధరించడం ద్వారా డిఎంకే అధినేత కరుణానిధిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. ఆమె విజ్ఞప్తిని తాను మన్నించానని, ఆ సమయంలో అలయెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
1998లో అలయెన్స్.. ఆర్థిక మంత్రి
1998లో లోకసభకు ఎన్నికలు జరిగాయని, తాను మధురై నుంచి పోటీ చేశానని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. అదే సమయంలో జయలలిత... వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరారని తెలిపారు. వాజపేయి హయాంలో తనను ఆర్థిక మంత్రిగా చేయాలని జయలలిత భావించేవారని తెలిపారు. కానీ అలా జరగలేదన్నారు.
జయలలిత అప్ సెట్... ప్రభుత్వాన్ని కూల్చేందుకు..
తనను ఆర్థిక మంత్రిగా చేయాలని జయ గట్టిగా భావించారని, కానీ అలా జరగలేదన్నారు. దీంతో జయలలిత అప్ సెట్ అయ్యారని తెలిపారు. అప్పుడే వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావించాలని తెలిపారు. ఆ సమయంలో ఆమె ఏం చేసేందుకైనా సిద్ధమయ్యారన్నారు. వాజపేయి ప్రభుత్వం పోతే సోనియాతో చర్చలు జరపాలని తాను సూచించానని తెలిపారు. ఆమె అందుకు సిద్దపడ్డారన్నారు. దీంతో తాను సోనియా - జయ మధ్య టీ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయిందని తెలిపారు. కానీ ఆ తర్వాత సోనియా గాంధీ.. జయను నిండా ముంచారన్నారు. అయితే అందుకు కారణాలను తాను ఇప్పుడు చెప్పదలుచుకోలేదన్నారు.
జయకు భయంకరమైన అనుభవం
ఆ తర్వాత జయలలిత రాజకీయ శతృవు డిఎంకే (కరుణానిధి) ఎన్డీయేలో జాయిన్ అయ్యారని చెప్పారు. ఆ సమయంలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో జయలలిత అధికారం కోల్పోయారన్నారు. ఇది ఆమెకు భయంకరమైన అనుభవం అన్నారు. అయితే, ఆ తర్వాత 2001లో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారని, ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు.
శశికళ వల్లే మా ఇద్దరి మధ్య విభేదాలు
శశికళ వల్లే జయలలిత, తనకు మధ్య పలుమార్లు విభేదాలు వచ్చాయని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. కానీ ఆ శశికళ తనను టార్గెట్ చేసుకుందన్నారు. జయలలిత రాజకీయ జీవితాన్ని అంతటిని శశికళ ప్రభావితం చేశారన్నారు.
నన్ను రాష్ట్రపతిగా చూడాలనుకున్నారు
2007లో మరోసారి జయలలిత తనను కలిశారని చెప్పారు. జయలలిత తనను రాష్ట్రపతిగా చూడాలనుకున్నారని చెప్పారు. కానీ తాను హార్వార్డ్ యూనివర్సిటీలో టీచింగ్ క్లాసెస్ చెప్పవలసి ఉందని, అలాగే తాను రాష్ట్రపతిగా పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని జయలలితకు చెప్పానని అన్నారు. తన చాలామంది రాజకీయ నాయకులు తానంటే భయపడతారని, కాబట్టి గెలుపు పైన తనకు కూడా నమ్మకం లేదన్నారు.
పన్నీరు సెల్వంను ఎదగనీయరు
ఆ తర్వాత అన్నాడీఎంకే పుంజుకుందని తాను భావిస్తున్నానని చెప్పారు. జయలలిత మృతి నేపథ్యంలో ప్రస్తుత సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వాన్ని నడపలేరన్నారు. ఎందుకంటే, మొదటి కారణం.. శశికళ ఎవరిని కూడా ఎదగనీయరని తెలిపారు. రెండో కారణం కేవలం 30 శాతం మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దేవార్ కమ్యూనిటికీ చెందిన వారన్నారు. పన్నీరు సెల్వం, శశికళ కూడా అదే కమ్యూనిటీకి చెందిన వారు. దాదాపు 70 శాతం మంది ఎమ్మెల్యేలు నాన్ దేవార్లు అన్నారు. వీరంతా దేవార్ కమ్యూనిటీని ప్రోత్సహించరని చెప్పారు. రానున్న కాలంలో పన్నీరు సెల్వం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.