సచిన్కు భారతరత్న ఎలా ఇస్తారు: జెడియు ఎంపి
పాట్నా: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వడాన్ని జనతాదళ్ - యునైటెడ్ పార్లమెంటు సభ్యుడు ప్రశ్నించారు. హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ను కాదని సచిన్ టెండూల్కర్కు భారతరత్నను ప్రకటించడాన్ని జెడి (యు) పార్లమెంటు సభ్యుడు శివానంద తివారీ తప్పు పట్టారు.
ధ్యాన్చంద్ను విస్మరించి, సచిన్ టెండూల్కర్కు ఎందుకు భారతరత్న ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కార్పోరేట్, శక్తివంతమైన మీడియా లేని కాలంలో ధ్యాన్ చంద్ హాకీ క్రీడా రంగంలో సత్తా చాటి భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడని ఆయన అన్నారు.

ధ్యాన్చంద్ ప్రతిభకు జర్మనీ ఫాసిస్టు నేతలు కూడా మురిసిపోయి డబ్బు, సంపద్వంతమైన జీవనాన్ని ఇస్తామని ముందుకు వచ్చారని, అయినా ధ్యాన్చంద్ భారతదేశానికే కట్టుబడి ఉన్నాడని ఆయన చెప్పారు. సచిన్ టెండూల్కర్ ఉచితంగా ఆడలేదని, దేశంలో క్రికెట్ను మార్కెట్ చేయడం ద్వారా కార్పోరేట్ సంస్థలకు ఉపయోగపడి కోట్లాది రూపాయలు సంపాదించారని తివారీ అన్నారు.
ప్రస్తుతం భారతరత్న తన విలువను కోల్పోయిందని ఆయన అన్నారు. భారత రత్నపై, దాన్ని ఎవరికి ఇవ్వాలనే అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తీవారి ప్రకటనతో తమకు సంబంధం లేదని జెడియు అధికారి ప్రతినిధి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications